ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కేసులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (APHO) తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో కేవలం ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిపైనే ఫోకస్ పెట్టగా, ఇప్పుడు అన్ని దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయనున్నారు.
విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ను తప్పనిసరి చేశారు. ప్రతి ప్రయాణికుడి శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేక పరికరాలతో పరీక్షించనున్నారు. అలాగే ప్రయాణికులు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అందులో గత 21 రోజుల ప్రయాణ వివరాలు, ఆరోగ్య పరిస్థితి, జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉన్నాయా అనే సమాచారాన్ని నమోదు చేయాలి.
ఎవరైనా ప్రయాణికుల్లో జ్వరం, తీవ్రమైన అలసట, వాంతులు లేదా శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలోకి తీసుకోనున్నారు. అనుమానితులను సాధారణ ప్రయాణికులకు దూరంగా ఉంచి ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. అవసరమైతే నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి విమానాశ్రయ అధికారులు, CISF, ఇమ్మిగ్రేషన్ విభాగం, కస్టమ్స్ సిబ్బంది మరియు ఎయిర్లైన్స్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ప్రతి దశలో ఆరోగ్య భద్రతా నిబంధనలు పాటించేలా ప్రత్యేక ప్రోటోకాల్స్ సిద్ధం చేశారు.
అంతర్జాతీయ రాకల ప్రాంతాల్లో ప్రత్యేక క్యూలైన్లు, స్క్రీనింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అలాగే అనుమానిత ప్రయాణికులను ఇతరుల నుంచి వేరు చేసి తరలించేందుకు ప్రత్యేక మార్గాలను సిద్ధం చేశారు. ప్రయాణ సమయంలోనే ఆరోగ్య సూచనలు ప్రకటించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా తమ ఆరోగ్య వివరాలను నిజాయితీగా వెల్లడించాలని అధికారులు సూచిస్తున్నారు.





























