Chandra Mohan : “పదునారు వయనదిలే” అనే తమిళ చిత్రం. భారతీరాజా దర్శకత్వం వహించారు.అక్కడ కూడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా కమల్ హాసన్, పోకిరిగా రజనీకాంత్ నటించారు. 6 ప్రింట్లతో తమిళనాడులో విడుదలైంది. ఓ మాదిరి చిత్రం అన్నారు. నాలుగు వారాల తరువాత ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఆ ఆచూకీ తెలుసుకొని తెలుగు నిర్మాత మిద్దే రామారావు అక్కడికి వెళ్ళి 1.25 లక్షల రూపాయలిచ్చి రీమేక్ హక్కులు పొందారు. అప్పట్లో రీమేక్ హక్కులకు 40 వేల రూపాయలకు మించి ఇచ్చేవారు కాదు.

మిద్దే రామారావుతో అంగర సత్యం, అంగర లక్ష్మణ రావు కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే దీనికి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావించారు. అప్పటికే ఆయన ‘అడవిరాముడు’ విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రీమేక్ ని ఒప్పుకుంటాడా లేదా అన్న సందేహంతో నిర్మాతలు ఆయన్ను సంప్రదించారు. అప్పటికీ తమిళ చిత్రం చూసిన ఆయన సినిమా పై ఆసక్తి చూపించి చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూలో.. యాంకర్ ఆనాటి “పదహారేళ్ళ వయసు” చిత్రం గురించి ప్రస్తావించగా.. చంద్రమోహన్ స్పందిస్తూ..

రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు. దీనికి ముందు ఆమె “అనురాగాలు” అనే చిత్రంలో నటించింది. అది అంతగా ఆడలేదు. కావున నిర్మాతలు ఆమెను సంప్రదించలేదు. శ్రీదేవి కంటే ముందు హీరోయిన్ గా జయప్రద, జయచిత్ర లను అనుకున్నారు. కానీ వీరి వయసు 16 ఏళ్ల కంటే ఎక్కువ కనిపిస్తుందని తిరిగి మరో హీరోయిన్ కోసం ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శ్రీదేవి తల్లిగారు దర్శక నిర్మాతలను కలిసి ఈ సినిమాలో శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుపట్టారు.

చంద్రమోహన్ ప్రక్కన శ్రీదేవి కొంచెం ఎత్తుగా ఉంటారు. లోగడ చంద్రమోహన్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా శ్రీదేవి నటించారు. మరి శ్రీదేవి చిన్న పిల్లలాగా కనిపిస్తుందని దర్శక నిర్మాతలు వద్దన్నారు. కానీ శ్రీదేవి వాళ్ళ అమ్మగారు ససేమిరా వినలేదు. తమిళ మాతృకలో మా కూతురే హీరోయిన్ గా చేసిందని తిరిగి తెలుగులో కూడా శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకోండని ఆవిడ ఎంతో ప్రాధేయపడ్డారు. అలా చివరి ప్రయత్నంగా మాత్రమే శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారని ఆయన చెప్పారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనేక థియేటర్లో 100 రోజులు ఆడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూశారు.

తరువాత ‘పదహారేళ్ళ వయసు’ సినిమాను ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ సినిమా పూర్తయ్యాక శ్రీదేవిని తమ తదుపరి చిత్రం ‘వేటగాడు’ కోసం ఎంపిక చేశారు. ఆ తర్వాత కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, దేవత, శ్రీరంగనీతులు, కిరాయి కోటిగాడు లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించి బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా ఆమె అద్భుత విజయాలను చవి చూశారని ఆ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.






























