Chiranjeevi – Venkatesh : 1990 లో “రాజా” అనే టైటిల్ తో వచ్చిన సినిమాలలో చిరంజీవి, వెంకటేష్ నటించారు. “రాజావిక్రమార్క” 1990లో రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, అమల, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిందీ లోకి దౌలత్ కి దునియా పేరుతోను తమిళం లోకి “సత్యమా నాన్ కావైకారన్ గానూ” అనువదించారు. ఈ చిత్రం తమిళ చిత్రం మై డియర్ మార్తాండన్ కు రీమేక్. ఈ సినిమాను 1988 లో విడుదలైన కమింగ్ టు అమెరికా ఆధారంగా రూపొందించారు.

“రాజావిక్రమార్క” ( చిరంజీవి ) ఒక చిన్న రాజ్యమైన స్కంద ద్వీపపు యువరాజు. అతను యువరాజు కాబట్టి, తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి అతనికి వీలుండేది కాదు. అతని తండ్రి రాజా భూపతి ( సత్యనారాయణ ) మరొక రాజ్య యువరాణితో పెళ్ళి సంబంధం మాట్లాడుతాడు. ఆమె తనదైన మెదడూ వెన్నెముకా లేని మనిషి. విక్రమార్క తన నమ్మకమైన స్నేహితుడు జాకీ ( బ్రహ్మానందం ) తో కలిసి తన జీవితాన్ని తాను స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాన్ని విడిచిపెట్టాడు. పెద్ద ఆధునిక నగరంలో, అతను ఒక స్నేహితుడిని కలిసి మెకానిక్గా పనిచేస్తాడు. ఈ సమయంలో అతను రేఖ ( అమలా ) పై జరిగిన రెండు హత్యా ప్రయత్నాల నుండి ఆమెను రక్షిస్తాడు. ఆమె మామ విశ్వనాథం ( రాగోపాల్ రావు ) అతన్ని ఆమెకు బాడీగార్డ్ గా నియమిస్తాడు. వాస్తవానికి తానే డబ్బు కోసం ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నానని విశ్వనాథం అతడికి వెల్లడిస్తాడు.

అతడి కోసం ఈ హత్య చేసేందుకు విక్రమార్క అంగీకరిస్తాడు. అదే సమయంలో ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఇంటి నుండి గెంటివేసిన తరువాత విశ్వనాథం, కనకారావు (గొల్లపుడి మారుతి రావు ), రాజా కోటప్ప ( కోట శ్రీనివాసరావు ) తో కలిసి విక్రమార్కనూ అతని తల్లిదండ్రులనూ చంపడానికి ప్రయత్నిస్తారు. విక్రమార్క వాళ్ళను అడ్డుకుని తన రాజ్యానికి రాజుగా పాలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్-కోటి స్వరపరచిన గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి…..

అయితే ఇదే సంవత్సరంలో వెంకటేష్ తమ సొంత బ్యానర్లో ఒక చిత్రంలో నటించారు. “బొబ్బిలి రాజా” 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, దివ్యభారతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 1990 సెప్టెంబరు 14లో విడుదల అయింది. దివ్యభారతి తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా డి. రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఆయన నటించిన చిత్రాలలో ఈ సినిమా వెంకటేష్ కు మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

సంక్షిప్తంగా కథలోకి వెళితే…. సుందరయ్య ఒక ప్రజాసేవకుడు. వాళ్ళ ఎదురింట్లో ఉండే రాజేశ్వరి దేవి కోటీశ్వరురాలు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని ఆమె కోరిక. సుందరయ్య ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబెడతాడు. సుందరయ్యకు ప్రజాబలం ఉండటం వల్ల ఆయన చేతిలో తాను ఓడిపోతానని భావించిన రాజేశ్వరి దేవి సుందరయ్య కుటుంబంపై చెడు ప్రచారం చేస్తుంది. సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి రాజేశ్వరి తమ్ముడు సూర్యం ప్రేమించుకుని ఉంటారు. ఫలితంగా రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని బజారుకీడుస్తుంది.

ఈ విషయం తెలిసిన సూర్యం, అహో బలరావుల మధ్య గొడవ జరిగి సూర్యం మేడ మీద నుంచి పడిపోయి మరణిస్తాడు. ఆ హత్యను సుందరయ్య, రాజ్యలక్ష్మి మీద వేసి వాళ్ళను జైలుకు పంపిస్తుంది రాజేశ్వరిదేవి. అక్కడ ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి మీద బలాత్కారానికి ప్రయత్నించడంతో అతన్ని హత్య చేసి తండ్రితో కలిసి అడవిలోకి పారిపోతుంది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. ఇళయరాజా స్వరపరిచిన అన్ని గీతాలు ఆంధ్రదేశమంతటా ఉర్రూతలూగించాయి. చిరంజీవి హీరోగా నటించిన “రాజా విక్రమార్క” పరాజయాన్ని పొందగా “బొబ్బిలిరాజా” చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.



























