CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నాయా.. ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని విపరీతంగా ప్రచారం కొనసాగుతోంది. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగుబోవని.. సోషల్ మీడియాలో తలాతోక లేని ప్రచారం జరగుతుందని స్పష్టం చేశారు. 103 స్థానాలతో తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా మండిపడ్డారు. మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. బడ్జెట్ వల్ల దేశం తిరోగమనం చెందుతుందని ఆయన అన్నారు. బడ్జెట్ లో రైతులకు, పేదలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎలాంట ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ప్రధాన మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం అన్ని అబద్ధాలు, మాయ మాటలు చెబుతుందన్నారు.
గుజరాత్ మోడల్ ను అడ్డు పెట్టుకుని..
నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాదని.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాని అని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వేషధారణతో ప్రధాని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. వీటివల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం జరగదని అన్నారు. కరోనా వల్ల కుంటుబడిన హెల్త్ సెక్టార్ కు నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ మోడల్ ను అడ్డు పెట్టుకుని మోదీ ప్రధాని అయ్యారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని మర్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైన సమయంలో అవసమైన బాధ్యత నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళా ఖాతంలో కలపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.































