తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను అందిస్తున్నారు. ఇకపై ఈ పెన్షన్ 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా వర్తిస్తుందని ఆదివారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

గత ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్ అందనుంది. ఈ పెన్షన్ పొందడానికి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా కింద 2116 లను అందించనున్నారు. ఓటర్ కార్డ్ పై ఉన్న పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని పెన్షన్ అందించనున్నారు. ఈ క్రమంలోనే ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకొని అభ్యర్థికి మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాని 3ఎకరాలకు మించి ఉండకూడదు.
అదేవిధంగా గ్రామాలలో వార్షిక ఆదాయం 1.5 లక్షలు పట్టణాలలో రెండు లక్షలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వ్యాపారంలో అధిక లాభం పొందే వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే డాక్టర్లు,కాంట్రాక్టర్లు వంటి అధిక ఆదాయం కలిగి ఉండి వారి సంతానం పై ఆధారపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఈ పథకం వర్తించదు. ఎవరి పేరుమీద నైతే హెవీ వెహికల్స్ ఉంటాయో అలాంటి వారు కూడా అనర్హులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వితంతువులు 60 సంవత్సరాలు పైబడిన వారు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద 2,116 రూపాయలను అందిస్తోంది. దివ్యాంగులకు 3,116 రూపాయలను అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.































