షకలక శంకర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీకాకుళం యాసతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ కమెడియన్ ఖతర్నాక్ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గయ్యాడు. అసలు కమెడియన్లకు హీరోగా ఛాన్స్ లు రావడమే కష్టం అనుకుంటే షకలక మాత్రం టాలీవుడ్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయాన్ని పక్కన బెడితే వరుసగా సినిమాలలో అయితే నటించాడు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా కూడా ఈయనకు మంచి ఇమేజ్ ఉంది. పవన్ ఏం చేసినా కూడా భజన చేస్తుంటాడు మన షకలక శంకర్. అది తప్పు రైట్ అనే విషయం ఈయనకు అసవరం లేదు. అక్కడ పవన్ ఉన్నాడనేది మాత్రమే కావాలి.

అలాగే తాను నటించే సినిమాల్లో కూడా పవన్ భజనే కనిపిస్తుంటుంది. ఇప్పటికీ కూడా షకలక శంకర్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం మరో ఆసక్తికరమైన విషయం. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా షకలక శంకర్ మరో సోనూసూద్ లా మారిపోయాడు. కరోనా కష్టకాలంలో అందరికీ సేవ చేస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పాపులరైన సోనుసూద్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో.. తాజాగా షకలక శంకర్ కూడా సేవా కార్య్రమాల్లో ముందుంటున్నాడు. శక్తికి మించిన ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తున్నాడు షకలక శంకర్. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్లో దర్శకత్వం విభాగంలో పనిచేసే బైరు సిద్దు అనే యువకుడి కుటుంబ పరిస్థితి చూసి షకలక శంకర్ చలించిపోయాడు. ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకున్నాడు. లక్షా ఇరవై వేల రూపాయలతో కాడెద్దులు, నాగలి కొని ఆ కుటుంబానికి సాయం చేశాడు. బైరు సిద్దుది స్వస్థలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి వెళ్లి స్వయంగా తన చేతులతో అందేశాడు షకలక శంకర్. ఆ సంగతిని సోషల్ మీడియాలోని నెటిజన్లు మరిచిపోకముందే.. తాజాగా మరో సాయం చెయ్యడానికి ముందుకొచ్చాడు షకలక శంకర్.

కరోనా వైరస్ మూలంగా చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.! ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఓ 7 కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చాడు మన జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్. ఆ 7 కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏకంగా కరీంనగర్ వీధుల్లో శంకర్ భిక్షాటన చేసాడు షకలక శంకర్. తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేసి 90 వేలు సమకూర్చిన షకలక శంకర్ తనదగ్గరున్న కొంత డబ్బును జోడించి మొత్తం లక్ష రూపాయలతో కరీంనగర్లోని ఆ 7 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాడు. ఈ సందర్భంగా తనకి సహకరించిన మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్లకు కృతజ్ఞతలు తెలియజేసాడు షకలక శంకర్.

ఈవిధంగా నెలకి ఒకసారి అయిన పెద్దవాళ్ళకి ఆర్ధిక సహాయం చేయాలని ఉందని మీడియాకు తెలియజేసాడు షకలక శంకర్. శంకర్ చేసిన పనికి అక్కడున్నవాళ్లు అభినందించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. జబర్దస్త్ షోలో వస్తున్న డబ్బులతో కూడా కొంత వరకు పెద్దవాళ్ళకి ఖర్చు చేస్తున్నఈ జబర్దస్త్ కమెడియన్ ఈమధ్య నూతన్ నాయుడు తెరకెక్కించిన “పరాన్న జీవి” చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.! లేటెస్ట్ గా జర్నలిస్ట్ ప్రభు తెరకెక్కిస్తున్న “రాంగ్ గోపాల్ వర్మ” చిత్రంలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా “లాస్ట్ గాడ్ ఫాదర్” అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు షకలక శంకర్. మొత్తానికి వెండితెరపై నవ్వులు పూయిస్తున్న షకలక శంకర్ ఉన్నతమైన మనసుకు మనందరం కూడా హాట్సాఅఫ్ చెబుదాం.!



























