తెలంగాణా రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఈరోజు (మంగళవారం) కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,991 కు చేరుకుంది. కాగా ఈ మహమ్మారి సోకి రాష్ట్రంలో ఈరోజు ఒకరు మృతిచెందారు. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తంగా కరోనా సోకి 57 మంది చనిపోయారు.

అయితే కరోనా నుంచి కోలుకుని ఈరోజు 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇంకా 650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,284 మంది గా నమోదైంది. ఈ ఒక్కరోజులో కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ జిల్లాలో 6 నమోదు కాగా, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మరోవైపు వలస కూలీలు-12 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.




























