దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా..? రాదా..? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. అయితే తాజాగా మోడెర్నా కరోనా విషయంలో శుభవార్త చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ లో ఆశాజనకమైన ఫలితాలను సాధించినట్టు వెల్లడించింది.

అన్ని వయస్సుల వారిపై కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించామని ఈ వ్యాక్సిన్ వృద్ధులపై కూడా సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొంది. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో వ్యాక్సిన్ కు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. యువతలో ఏ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయో వృద్ధుల్లో కూడా అదే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతూ ఉండటంతో వైరస్ కట్టడి సాధ్యమేననే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి సైతం వ్యాక్సిన్ అద్భుతంగా పని చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ అండర్సన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ఫలితాలు ఆశలు రేకెత్తించేలా ఉన్నాయని.. వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. వేర్వేరు వయస్సుల వారికి వేర్వేరు మోతాదులో వ్యాక్సిన్ ఇచ్చి ఈ పరిశోధన చేస్తున్నారు.
మరోవైపు రష్యా కరోనా వ్యాక్సిన్ కూడా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. 2020 చివరినాటికి లేదా 2021 జనవరి నాటికి భారతదేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో కరోనాపై భయాందోళన తగ్గినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారిని కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతోంది.































