ప్రపంచంవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కోవిడ్ 19 ఇప్పటిలో తగ్గేలా కనిపించడం లేదని కనీసం రెండు సంవత్సరాలు వరకు దీని ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందిలో రోగనిరోధక శక్తి పెరిగే వరకు ఈ మహమ్మారి ప్రభావం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని తొందరగా అటాక్ చేసే గుణం ఉన్న ఈ మహమ్మారిని జలుబు తగ్గించినంత ఈజీగా కట్టడి చేయడం కుదరదని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాకు చెందిన పరిశోధకులు.

ఈ మేరకు ఒక ప్రకటించింది యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాకు చెందిన సెంటర్ ఫార్ ఇన్ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం. వైరస్ లక్షలు కనిపించక ముందే ఇది సోకిన వారిలో వ్యాధి తాలూక ఇన్ఫెక్షన్ ఉంటుందని వీరు ఇచ్చిన రిపోర్ట్ లో తెలిపారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందనే.. ప్రస్తుతానికి ఎటువంటి మెడిసిన్ లేని కారణంగా లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేని పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే వ్యాపారాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాయి. అదే సమయంలో ఈ వైరస్ విడతల వారీగా 2022 వరకు ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. దీనితో పాటుగా “ప్రస్తుత పరిస్థితులు, అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ కరోనా మహమ్మారి అంత త్వరగా అంతమయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు 2022 వరకు మానసికంగా సిద్ధమవ్వాలి” అని పరిశోధకుల మాట. వ్యాక్సిన్ తయారీ చేసే పనిలో పలు ఫార్మా కంపెనీలు నిమగ్నమయి ఉన్నాయి.
































