టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పేరు తప్పక ఉంటుంది. ప్రతి పాత్రలోను తన హావభావాలతో మెప్పించే నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. తొలినాళ్ల నుంచి కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ధర్మవరపు ప్రకాశం జిల్లా కొమ్మినేని వారిపాలెంకు చెందిన వారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటి నుంచి సినిమాలన్నా, నాటక రంగమన్నా ఆసక్తి ఎక్కువ.

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై ధర్మవరపు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆయన క్యాన్సర్ బారిన పడి 2013లో చనిపోయారు. సినిమాలపై మక్కువతో బీకామ్ చదువుతున్న సమయంలో ఇంట్లో నుంచి మద్రాస్ పారిపోయిన ధర్మవరపు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించి అవకాశాలు రాకపోవడంతో వెనుదిరిగారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడం అంత సులభం కాదని భావించారు.

ఆ తరువాత బీకామ్ పూర్తి చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం సంపాదించారు. పోస్టింగ్ హైదరబాద్ లో ఇవ్వడంతో అక్కడికి మకాం మార్చారు. హైదరాబాద్ లో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు దూరదర్శన్, ఆకాశవాణిలకు నాటకాలు రాశారు. ఆనందో బ్రహ్మ ద్వారా బుల్లితెరపై రంగ ప్రవేశం చేసిన ధర్మవరపు జంధ్యాల దృష్టిలో పడి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

ధైర్యం, నువ్వు నేను, వర్షం, ఒక్కడు సినిమాల్లో ధర్మవరపు చేసిన కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి టాప్ కమెడియన్లైన బ్రహ్మానందం, అలీలతో పోటీ పడి వరుస అవకాశాలను సంపాదించుకున్నారు. ధర్మవరపు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరపు వీళ్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. భార్య కృష్ణజ గృహిణి కాగా కొడుకులు రవి బ్రహ్మతేజ, రోహిత్ సందీప్ వ్యాపార రంగంలో పెద్ద బిజినెస్ మేన్ లుగా ఎదిగి స్థిరపడ్డారు.



























