ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక ప్రసంగం చేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా పాల్గొన్నారు.

దేశ భద్రతపై ఆందోళన
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో దేశ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంపై విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ఆ శక్తుల కనుసన్నల్లో దేశీయ శక్తులు కూడా పనిచేస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఓటమి పాలైన కొన్ని రాజకీయ పార్టీలు నిరాశతో అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, వారి ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
‘చీకటి రోజులు’గా గత పాలన
గత ప్రభుత్వ పాలనను “చీకటి రోజులు”గా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తాము ఆ దుర్భర పాలనకు వ్యతిరేకంగా పోరాడామని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా “కలిసి ఉంటేనే పోరాటం విజయవంతం అవుతుంది. దేశ భద్రత కోసం అందరం ఏకం కావాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు జరిగిన ఉద్యమాలన్నీ మత ప్రాతిపదికన జరిగాయని ఆయన పేర్కొన్నారు.
తీర ప్రాంత భద్రతపై హెచ్చరికలు
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో పాకిస్థాన్లో హిందువులు ఎందుకు లేరని ప్రశ్నిస్తూ, ఒక ప్రభుత్వం కనీసం దశాబ్దంన్నర పాటు స్థిరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, కాకినాడ తీరప్రాంతంలో జరుగుతున్న డీజిల్ అక్రమ రవాణాపై కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి అక్రమాలకు అవకాశం ఇస్తే బియ్యం, డీజల్తో పాటు ఆయుధాలు, బాంబులు కూడా తీరప్రాంతం నుంచి రవాణా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో తీరప్రాంత పోలీస్ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ భద్రత, రాష్ట్ర స్థిరత్వం, ప్రజల ఐక్యతపై ఆయన దృష్టిని తెలియజేస్తున్నాయి. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
— JanaSena Party (@JanaSenaParty) August 15, 2025





























