సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఇక ఆ సినిమా విడుదల రోజు థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకొని భారీ కటౌట్లు పాలాభిషేకాలు బాణాసంచా కాల్చడం ఓ రేంజ్ లో ఉంటుంది.

అయితే ఓకే హీరో రెండు సినిమాలలో నటించి ఆ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి ఎదురుకాని పరిస్థితి నందమూరి బాలకృష్ణకు ఎదురైంది. బాలకృష్ణ నటించినటువంటి “బంగారు బుల్లోడు”, “నిప్పురవ్వ” సినిమాలు రెండు ఓకే రోజు విడుదల కావడంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఏ ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన “నిప్పురవ్వ” సినిమాను యువరత్న బ్యానర్ పై విజయశాంతి నిర్మాణం చేపట్టారు. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి బాలకృష్ణ మొదట్లో ఆసక్తి చూపినప్పటికీ చివరికి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అనుకున్న దానికన్నా బడ్జెట్ హద్దులు దాటి పోవడమే కాకుండా మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే బాలకృష్ణ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో జగపతి బ్యానర్ పై ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలయ్య బాబు సరసన రమ్యకృష్ణ, రవీనాటాండన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు కోటి సంగీత దర్శకత్వం వహించారు. ఈ విధంగా ఈ రెండు సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకొని ఒకేరోజు థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమయ్యాయి. అప్పటికి ఎంతోమంది హెచ్చరిస్తునప్పటికీ నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోటీపోటీగా ఈ రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేశారు.

అలా 1993 సెప్టెంబర్ 3వ తేదీన ఈ రెండు సినిమాలు థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ‘బంగారు బుల్లోడు’ సినిమా ముందు ‘నిప్పురవ్వ’ నిలవలేకపోయింది. అయితే ఈ రెండు చిత్రాలు రాజమండ్రి స్ట్రేయిట్ 100 రోజులు ఆడి రికార్డు సృష్టించాయి. అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా బాలయ్య బాబు రికార్డును తిరగ రాయలేదు. అయితే అప్పటి వరకు ఈ రికార్డ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట ఉంది.. 1961లో ఎన్టిఆర్ నటించిన ‘పెండ్లి పిలుపు’ , సతీ సులోచన (ఇంద్రజిత్) సినిమాలు ఒకేరోజున రిలిజయ్యాయి. ఆ తరువాత అయన కొడుకు నందమూరి బాలకృష్ణ ఆ రికార్డ్ ను మరోసారి రిపీట్ చేసారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ సినిమాలు రాజమండ్రిలో డైరెక్ట్ గా రిలీజై శతదినోత్సవం జరుపుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కూడా “టింగు రంగడు”, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కానీ పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవి తో పాటూ మోహన్ బాబు కూడా మరో హీరోగా నటించారు.. ఇప్పటి తరం హీరోలలో ఇండస్ట్రీలో హీరో నాని “ఎవడె సుబ్రమణ్యం”, “జెండా పై కపిరాజు” వంటి సినిమాలు చేసారు కానీ ఆ సినిమాలు చేసిన సమయంలో నానీ రేంజ్ తక్కువ కాబట్టి బాలకృష్ణతో పోలిక సరికాదు.






























