కన్ను తెరిస్తే జననం..!! కన్ను మూస్తే మరణం…!! అన్నాడో మహాకవి సమాజాన్ని మానవసంబంధాలను ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప గుండెల్ని పిండే పదాలు కవి కలానికి అంత సులువుగా దొరకవు. గీతాంజలి సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ చిత్రించిన అద్భుతం కళాఖండం మరో రూపం గా పేర్కొనవచ్చు. బావు కతను నింపుకున్న ఓ కవి మనిషి హృద్యంతరాలను తాకే సుమధుర సుందర గీతమాలిక ఆనాటి గీతాంజలి చిత్రం.

కళాత్మక దర్శకుడు మణిరత్నం అనేక మాసాలుగా తన మస్తిష్కంలో దాచుకున్న ప్రేమ కావ్యం గీతాంజలి కథ. మణిరత్నం, ఇళయరాజా, బాలు, వేటూరి, పీసీ శ్రీరామ్ లాంటి పంచకళారత్నాలు ఈ చిత్రానికి పనిచేశారు. ఇళయరాజా సంగీతం నుండి జాలువారిన గీతాలు ఇప్పటికీ శ్రోతలను కట్టిపడేస్తుంది. “వేటూరి కలం బాలు గళం” ఈ సినిమాని మరో మెట్టుకు తీసుకెళ్ళింది. ఇందులోని అనేక దృశ్యాలు పూర్తిగా వెలుగులో కాకుండా అలా అని పూర్తిగా చీకటిలో కాకుండా వెలుగునీడల మిశ్రమంతో సృజనాత్మకంగా తీసి పీసీ శ్రీరామ్ గీతాంజలి సినిమా పతాక స్థాయికి తీసుకెళ్లారు.

ఆనాటి అనార్కలి, లైలా మజ్ను, మరో చరిత్ర అ అభినందన లాంటి చిత్ర ప్రేమ కావ్యాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. వాటి సరసన చేరిన మరో అరుదైన ప్రేమ కావ్యం గీతాంజలి. ఈ విషాద చిత్రాల్లో ఏ సినిమాను తీసుకున్నా నాయకానాయికలకు ఏదైనా ప్రమాదం జరగడమో లేదా ప్రాణాంతకమైన జబ్బు రావడమో లాంటివి జరగడంతో చుట్టూ ఉన్న పాత్రలు విషాద వదనములో మునిగి చివరకు ప్రేమికుల్లో ఎవరో ఒకరు మరణించడంతో అంతిమంగా ప్రేక్షకులు బరువైన హృదయంతో నిష్క్రమించడం జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే గీతాంజలి సినిమా షూటింగ్ జరుగక ముందు ఢిల్లీలో ఒక అమ్మాయి క్యాన్సర్ మహమ్మారితో చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న దర్శకుడు మణిరత్నం ఆమె గురించి వాకబు చేశాడు. ఆమె పేరు గీతాంజలి అని తెలిసి కన్నీటి పర్యంతమై తను తీసిన సినిమాకు గీతాంజలి అని టైటిల్ పెట్టి అప్పటి వరకు లేని అరుదైన విజయాన్ని మణిరత్నం అందుకున్నారు.



























