1990 మొదలుకొని ఎంతో మంది బాలీవుడ్ తారలు తెలుగు తెరకు పరిచయమై, అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాంటి బాలీవుడ్ భామల్లో అందాల బ్యూటీ దివ్యభారతి ఒకరు. 1990 సురేష్ ప్రొడక్షన్స్ బి.గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలిరాజా చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ తో మొదటిసారిగా దివ్యభారతి నటిస్తూ తెలుగుతెరకు పరిచయమయ్యారు.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయఢంకా మోగించింది. అయితే బొబ్బిలిరాజా చిత్రంలో మొదటగా హీరోయిన్ గా రాధను అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రచయితలు పరుచూరి సోదరులు సూచన మేరకు రాధ స్థానంలో స్వర్గీయ దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత దివ్యభారతి మూడు(1991) తెలుగు చిత్రాల్లో నటించారు. రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, నా ఇల్లే నా స్వర్గంలో ఆమె నటించారు. 1991 శ్రీ సాయిరాం ఆర్ట్స్, అల్లు అరవింద్, వెంకటేశ్వరరావు, పంజా ప్రసాద్ నిర్మాణం, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రౌడీ అల్లుడు చిత్రం విడుదలయ్యింది.

ఈ సినిమాలో చిరంజీవి, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించారు. ధనవంతుడైన కళ్యాణ్ ఆటో నడిపే జానీ పాత్రలో మెగాస్టార్ ఇరగదీశారు. బప్పిలహరి అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది. దివ్యభారతి తన ఖాతాలో మరో విజయవంతమైన చిత్రాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత 1992లో ఆమె రెండు తెలుగు చిత్రాల్లో నటించారు. బాలయ్యతో ధర్మ క్షేత్రం, మోహన్ బాబుతో చిట్టెమ్మ మొగుడు చిత్రంలో నటించారు. బాలయ్య బాబుతో ఒకే చిత్రంలో నటించింది.

1992,శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్ కెసి.రెడ్డి నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ధర్మక్షేత్రం చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది. సమాజంలో జరిగే అన్యాయం, అధర్మం పై న్యాయవాదిగా బాలకృష్ణ నటన సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమా తొలిముద్దు దివ్యభారతి చివరి చిత్రంగా మిగిలిపోయింది.

1993 శ్రీ దుర్గా ఫిలిమ్స్, రుష్యందర్ రెడ్డి దర్శకత్వంలో తొలిముద్దు చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ప్రశాంత్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్న క్రమంలోనే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె మరణం తెలుగు సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచిది. ఆమె తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ తన నటన, గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దివ్యభారతి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. స్వర్గీయ దివ్యభారతి మొత్తం ఏడు తెలుగు చిత్రాల్లో నటించగా.. బొబ్బిలి రాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ విజయవంతమైన చిత్రాలుగా నిలువగా… మిగతా నాలుగు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.

1990 నాటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో కేవలం నాగార్జునతో మాత్రమే దివ్యభారతి నటించలేకపోయారు. మరో బాలీవుడ్ భామ అయిన నగ్మాతో కిల్లర్, అల్లరి అల్లుడు, వారసుడు లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ నాగార్జున స్వర్గీయ దివ్యభారతితో నటించపోవడం గమనార్హం.



























