సినిమా ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళలో చాలామంది స్టార్ స్టేటస్ దక్కిన తర్వాత తమ వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకు వచ్చి నిలబెట్టాలని, బాగా ఆస్థులు కూడ బెట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. కొంతమంది మాత్రం సంపాదించిన దానిని అవసరమైతే ఇంకాస్త అప్పు చేసైనా ఎదుటి వారు కష్టాలలో ఉంటే ధారాదత్తం చేసేస్తుంటారు. అలాంటి గొప్ప మనసున్న నటుడు ప్రభాకర్ రెడ్డి. ఎం. ప్రభాకర రెడ్డిగా సుపరిచితులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి వృత్తి రిత్యా వైద్యులు. డాక్టర్ అయినప్పటికీ నటన మీద ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. తెలుగులో మాత్రమే కాకుండా కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించారు.ప్రభాకర రెడ్డి ఎక్కువగా విలన్ పాత్రలలో నటించారు.

ఆయన 37 ఏళ్ల సినీ కెరీర్లో 500కు పైగా సినిమాల్లో నటించారు. వీటిలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. విలన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతమైన పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. ఇక నటుడిగా కొనసాగుతూనే కొన్ని దర్శకత్వం, నిర్మాతగా కూడా విజయాలను అందుకున్నారు. అంతేకాదు ‘కార్తీక దీపం’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించారు ప్రభాకర రెడ్డి. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్గానే కాకుండా అనేక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన విలన్ పాత్రలకి ప్రభాకర రెడ్డి తప్ప మరో ఆప్షన్ గానీ ఛాయిస్ గానీ ఉండేది కాదు.

ప్రభాకరరెడ్డి సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో 1935, అక్టోబర్ 8న పుట్టారు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో మెడిసిన పూర్తి చేశారు. ఇక 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన ‘చివరకు మిగిలేది’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించారు. అలా ఆయన దాదాపు 500 చిత్రాలలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రభాకర రెడ్డి పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి 21 తెలుగు సినిమాలకు కథలను అందించారు. ఆయన కథలతో రూపొందిన చిత్రాలన్నీ దాదాపు సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్లోనే ఉండేది. 90లలో మొదట్లో దాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రభుత్వం సినిమా వాళ్లకి గతంలో ఎకరాల కొద్ది భూమినిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్టైనప్పుడు ఇక్కడ, అగ్ర నటులకి స్థలాన్ని కేటాయించింది.

ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఉచితంగా ఇచ్చేశారు. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ పిలుచుకుంటున్నారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆనాడు ఆయన 10 ఎకరాలను దానం చేశారు. అందుకే హైదరాబాదు, మణికొండలో ఆయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు. ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎక్కడైనా ఉంటారా.



























