తెలంగాణ సర్కార్ సెలూన్లు, ధోబీ ఘాట్ల నిర్వహకులకు శుభవార్త చెప్పింది. 2021 సంవత్సరం జనవరి నెల నుంచి వీరికి ఉచిత కరెంట్ సరఫరా కానుంది. డిస్కమ్ లు ఇప్పటికే సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాయి. సీఎం కేసీఆర్ కు సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చి సీఎం కేసీఆర్ నివేదించిన అనంతరం డిస్కంలు ఉచిత కరెంట్ సరఫరా విషయంలో నిర్ణయం తీసుకోనున్నాయి.

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల హామీలను వెనువెంటనే అమలు చేసి ప్రజల్లో పార్టీని మరింత బలపడేలా చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఈ హామీకి ఆమోదం తెలపాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది.
డిస్కమ్ లు ఇప్పటికే సెలూన్లు, ధోబీ ఘాట్లు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాయనే వివరాలను సేకరించాయి. టీఆర్ఎస్ సర్కార్ మొదట సెలూన్లు, ధోబీ ఘాట్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భావించింది. కానీ ఆ తరువాత ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తోంది.
రైతులతో పాటు 101 యూనిట్ల కంటే తక్కువగా వాడే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇకపై రజకులు, క్షురకులు కూడా ఉచిత విద్యుత్ ను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది. డిస్కంలు సీఎం కేసీఆర్ కు నివేదించిన తరువాత ఈ విషయం గురించి స్పష్టత రానుంది.



































