ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేసినా, మ్యాచ్ను గెలవలేకపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. రెండు ఇన్నింగ్స్లలో కలిపి భారత ఆటగాళ్లు ఏడు కీలకమైన క్యాచ్లను వదిలివేయడంతో మ్యాచ్ టీమిండియా చేతులు దులుపుకుంది.

ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ ఫీల్డింగ్లో ఘోరంగా విఫలమవడం పెద్ద దుమారానికే దారి తీసింది. అతను ఒక్కడే రెండు ఇన్నింగ్స్లలో కలిపి నాలుగు క్యాచ్లు వదిలేసాడు. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న సమయంలో క్యాచ్ వదిలేయడం మ్యాచ్పై ప్రభావం చూపింది. ఆ తర్వాత డకెట్ 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సామాజిక మాధ్యమాల్లో జైస్వాల్పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతుండగా, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతని పక్షంగా నిలిచారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంభీర్, “క్యాచ్లు మిస్ అవుతాయి. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లు కూడా ఒకోసారి తప్పులు చేస్తారు. ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ వదిలేరు. ఒక్క జైస్వాల్ను బాధ్యుడిగా చేయడం సరైంది కాదు,” అంటూ జైస్వాల్ను రక్షించే ప్రయత్నం చేశారు.
“ఈ ఓటమికి ఎవ్వరినీ భాద్యులుగా భావించడం లేదు. క్రికెట్లో ఇలాంటివి సహజం. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మేము ఆశించినట్టుగా లేదు. మొదటి ఇన్నింగ్స్లో మేము 600 పరుగులు చేయాల్సిన అవకాశం ఉంది. కానీ 40 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయాం. అదే రెండవ ఇన్నింగ్స్లోనూ 30 పరుగులకే 6 వికెట్లు పోయాయి. ఇది మా ఓటమికి ప్రధాన కారణం.”
ఇలా గంభీర్ తన వ్యాఖ్యలతో జైస్వాల్పై పెరుగుతున్న ఒత్తిడిని తక్కువ చేయాలని ప్రయత్నించారు. ఇక రెండవ టెస్టులో భారత జట్టు ఫీల్డింగ్లో మెరుగుపడుతుందేమో వేచి చూడాలి.




























