Tirumala: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల – తిరుపతి ఒకటి. దేశంలోని నలుమూలల నుంచి రోజూ వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటు ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి విరజిల్లుతోంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగతోంది.

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఓమిక్రాన్, కరోనా భయాల వల్ల కూడా శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. దీనికి తోడు గతేడాది చివరలో కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల దర్శనం టికెట్లను కూడా టీటీడీ ప్రారంభించింది. దీంతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరిస్థితులు ప్రస్తుతం చక్కబడటంతో రానున్న కాలంలో మరింత మంది ప్రజలు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది.
72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని..
అయితే ఈ నేపథ్యంలో భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. దూరప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. తిరుమల- తిరుపతి మధ్య రాకపోకలకు ఒకేసారి టికెట్ తీసుకుంటే… 10 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల-తిరుపతికి వచ్చిన తర్వాత 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం నేటి నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించారు.



























