Telangana Farmers: తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో 2018, ఏప్రిల్ నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు ఇప్పటికీ కొనసాగుతోంది.

సంవత్సరంలో రెండు సార్లు ప్రస్తుతం ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. మొదట ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చిన కేసీఆర్ సర్కార్.. ఆ పెట్టుబడి సాయాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచి.. రూ.5 వేల చొప్పున రెండు సీజన్లలో రూ.10 వేలకు పెంచాడు.

ఇక ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య ఏడాదిఏడాదికి పెరుగుతూ వస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్ నిధులను డిసెంబర్ 28న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు ఈ నెల 28 నుంచి రైతులకు అందనుంది.
డిసెంబర్ 28న ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ:
మొదట ఈ నిధులు సరిగ్గా సర్దుబాటు కాకపోవడంతో డిసెంబర్ 15న రావాల్సిన ఈ రైతుబంధు డబ్బులు ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ నిధులు జమ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని.. సీఎం కెసిఆర్ ఆదేశాలతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రూ. 7,500 కోట్లు యాసంగి పంట కోసం రైతు బంధు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. మొదట ఎకరాలోపు భూమి ఉన్నవాళ్లకు.. తర్వాత ఎకరా నుంచి రెండకరాల మధ్య భూమి ఉన్నవారికి ఈ రైతుబంధు నిధులు జమ కానున్నాయి.




























