ప్రస్తుత కాలంలో భారతదేశంలోని ప్రజలకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హత పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. గుర్తింపు కార్డుగా ఉపయోగపడే ఆధార్ కార్డ్ లేకపోతే ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే మనుషులకు మాత్రమే కాదు ఆవులకు, గేదెలకు కూడా ఆధార్ కార్డ్ ఎంతో ఆవశ్యకం.

మోదీ సర్కార్ ఆవులు, గేదెలకు కూడా ఆధార్ కార్డ్ జారీ చేస్తోంది. ఆవులు, గేదెలకు ఆధార్ కార్డ్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోందా….? మోదీ సర్కార్ రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఆవులు, గేదెలకు ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. ఆవులు, గేదెలకు ఆధార్ నంబర్ ఉండటం వల్ల వాటిని అమ్మేవాళ్లకు, కొనేవాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది.

ఆవులు, గేదెల యొక్క ఆధార్ నంబర్ ను ఆన్ లైన్ లో ఎంటర్ చేయడం ద్వారా ఆవు, గేదె ఏ జాతికి చెందినది…? ఆ జంతువుల ఆరోగ్య పరిస్థితి ఏమిటి…? జంతువు బ్రీడ్, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ ఆవు, గేదె తప్పిపోయినా ఆధార్ నంబర్ సహాయంతో దానిని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఆవులు, గేదెలకు ఆధార్ ఇవ్వడం ద్వారా దేశంలోని పశు సంపద గురించి, పాడి రైతుల ఆదాయం గురించి ప్రతి ఒక్కరికీ సమాచారం అందుబాటులోకి రానుంది.

తాజాగా మోదీ సర్కార్ ఇగోపాల యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఆవు, గేదె నంబర్ ను ఎంటర్ చేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆవులు, గేదెలను ఈ యాప్ ద్వారా అమ్మడం లేదా కొనడం చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మోదీ సర్కార్ పశువులకు వ్యాక్సిన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.



























