తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగాల భర్తీ చేపడుతోంటే సీఎం కేసీఆర్ మాత్రం నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గత కొన్నేళ్ల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో సీఎం కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. విద్యాశాఖ అధికారుల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఖాళీల్లో విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
విద్యాశాఖతో పోల్చి చూస్తే పోలీస్ శాఖలో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. కేసీఆర్ సర్కార్ ఏకంగా 20,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయనుందని తెలుస్తోంది. హోం శాఖ వర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో 12,000 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో 4 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తం 50,000కు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
అయితే వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదలైతే బాగుంటుందని నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మరి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో చూడాల్సి ఉంది. త్వరగా నోటిఫికేషన్లు విడుదలైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ప్రయోజనం చేకూరనుంది.































