కాపు ఉద్యమంతో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం ఇంట రాజకీయ చిచ్చు రాజుకుంది. ఆయన కుటుంబంలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. కూతురు క్రాంతి చేసిన ఆరోపణలపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ఓ బహిరంగ లేఖ ద్వారా తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే?
ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి తండ్రీకూతుళ్ల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమారుడు గిరి నిర్బంధించారని, క్యాన్సర్ చికిత్సకు కూడా అడ్డుపడుతున్నారని క్రాంతి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి సంరక్షణ తనకు చాలా అవసరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవహారాల్లోకి రాజకీయాలు రావడంతో ఇది మరింత వేడిని రాజేసింది.
ముద్రగడ కౌంటర్ ఎటాక్!
కూతురు చేసిన ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కూతురి పేరును కూడా ప్రస్తావించకుండా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. “ఒక కుటుంబం నా ఫ్యామిలీపై కుట్రలు చేస్తోంది” అని ఆయన ఫైర్ అయ్యారు. తన చిన్న కొడుకు గిరి వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని, అతని సంరక్షణలోనే ఉన్నానని తేల్చి చెప్పారు.
కొడుకు ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు: ముద్రగడ
“మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. ఓర్వలేకపోతున్నారు, రగిలిపోతున్నారు. వాళ్లకు వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వస్తే తప్పేంటి? మేమేమైనా వారిని డబ్బులు అడిగామా? వారి సాయం కోరామా? ఏమీ లేదే, వాళ్లకు సంబంధం ఏంటి?” అని ముద్రగడ నిలదీశారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనవళ్లను సీఎంలను చేస్తా: సంచలన ప్రకటన
ఇక్కడితో ఆగకుండా ముద్రగడ మరింత సంచలన ప్రకటన చేశారు. “నా మనవళ్లను, మనవరాళ్లను కూడా రాజకీయాల్లోకి దింపుతాను. వాళ్లను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళతాను” అని ఆయన అన్నారు. తన కొడుకుకి, వియ్యంకుడికి, తనకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని ఆయన స్పష్టం చేశారు. “నా కొడుక్కి నాకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేస్తే, వాళ్ల గడప తొక్కుతానని అనుకుంటున్నారు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా వాళ్ల గుమ్మం ఎక్కను” అని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ముద్రగడ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.




























