75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జెండా అవిష్కరణకు ముందు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకున్న ప్రధానమంత్రికి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు.
జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెడు ఎంఐ-17 1వి హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.































