బాలచందర్ లోతైన జీవితాలను ఎలుగెత్తి చూపుతూ మనిషి అంతరంగాలను స్పృషిస్తూ.. 1976 బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రం రూపొందించబడింది. చిత్ర కథలోకి వెళితే…. సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్నంతా ఆమే పోషిస్తుంటుంది. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయిఉంటాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న (రజనీకాంత్) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉంటారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.

సరితను ప్రేమిస్తున్న తిలక్ (ప్రసాద్ బాబు) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరికీ పెళ్ళి చేస్తుంది.

సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (జి.వి. నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు చంద్ర (“ఫటాఫట్” జయలక్ష్మి) జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘిక కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్తో పెళ్ళి చేస్తుంది.
ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ (కమల్ హాసన్) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకుంటుంది.

అందరికీ శుభలేఖలు పంచుతుంది. సరిత పెళ్ళికి అంతా సిద్ధంగా ఉంటుంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడతాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిస్తుంది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్) తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు మళ్ళీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళే సిటీబస్సులో బయలుదేరుతుంది… మిమిక్రీతో కూడిన “తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల… అనే పాట బహుళ జనాదరణ పొందింది.

ఈ సినిమాకు గాను రజినీకాంత్ 1000 రూ.లు, జి.వి. నారాయణరావు 1500 రూ.లు పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం విశాఖపట్నంలో జరగడం మరో విశేషం. రజినీకాంత్, కమల్ హాసన్, జయప్రద వంటి తారాగణంతో రూపొందించబడిన ఈ చిత్రాన్ని అప్పట్లో స్టార్ వ్యాల్యూ లేని చిత్రమని సినీ ప్రముఖులు పెదవి విరిచారు.. కానీ చిన్న సినిమాగా వచ్చి అప్పట్లో భారీ చిత్రాల అయిన మనుషులంతా ఒక్కటే, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది వంటి చిత్రాల పోటీని తట్టుకొని బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.



























