సినీ విశ్లేషకులు అన్నట్టు ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో, ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుందో ఎవరు ఊహించలేము. అలాగే ఏ పాత్ర సంచలనం సృష్టిస్తుందో, ఏ సంభాషణ ఎవరి మనసును తాకుతుందదో, ఏ పాట ఏ మనిషిని మేలుకొలుపుతుందో.. ఎవరు ఊహించగలరు.

ఏ.వి.ఎమ్ బ్యానర్ లో ఎం.శరవణన్,ఎం.సుబ్రమణ్యన్ నిర్మాణ సారథ్యంలో ముత్తురామన్ దర్శకత్వం వహించిన సంసారం ఒక చదరంగం సినిమా 1987 జనవరి 14న విడుదలయ్యింది. ఓ స్టీల్ కంపెనీలో పదవి విరమణ పొందిన గుమాస్తా పాత్రలో అప్పలనరసయ్య గా గొల్లపూడి మారుతి రావు నటించారు. ఈ అప్పల నరసయ్య కు భార్య, ముగ్గురు కొడుకులు ఒక కూతురు. పెద్ద కొడుకు శరత్ బాబు ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, రెండో కొడుకు రాజేంద్ర ప్రసాద్ ఓ కంపెనీలో చిరు ఉద్యోగి, మూడో కొడుకు కాళిదాసు పదవ తరగతి చదువుతూ ఎప్పుడు ఫేయిల్ అవుతూంటాడు.

ఇంటి ఖర్చు విషయంలో అప్పల నరసయ్య కు తన పెద్ద కొడుకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. ఇంటిలో అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయని తన చెల్లెలు కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ అనవసరపు ఖర్చు కారణమవుతుందని. అలాగే తన తమ్ముడు రాఘవ నెల మొత్తం సంపాదించిన జీతం తనకంటే తక్కువేనని నానా మాటలు అనడంతో అప్పల నరసయ్య ఇంటి మధ్యలో లక్ష్మణ రేఖ లాంటి ఓ గీత గీస్తాడు.

అయితే ఈ సీన్ లో పెద్ద కొడుకు పాత్రలో శరత్ బాబు తండ్రి పాత్రలో గొల్లపూడి మారుతి రావు నటన సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. సంసారం చదరంగం సినిమాని మొదటి నుండి చివరి వరకు గొల్లపూడి మారుతి రావు తన భుజస్కంధాలపై సినిమాను నడిపించిన తీరు అమోఘం అనే చెప్పాలి. పాత్రలకు తగ్గట్టుగా గణేష్ పాత్రో రాసిన మాటలు ప్రతి మధ్యతరగతి సామాన్యుడిని కదిలిస్తూ ఉంటాయి.

మిస్టర్ ప్రకాష్ నీవు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని గొల్లపూడి అనడంతో శరత్ బాబు.. తన తండ్రిని పట్టుకుని ఇసుక తక్కెడ పేడ తక్కెడ లాంటి ఒకరికొకరు పొంతలేని వారిని అడగలేని వయస్సు మళ్ళిన వెన్ను పూసలేని ఓ వృద్ధుడి తో మాట్లాడుతున్నాను. అనే సంభాషణ నిజంగా గొల్లపూడి ఈ సినిమాలో చెబుతున్నంతసేపు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.






























