“సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం.” అనే పాట ఆరోజుల్లో ఆకాశవాణిలో శ్రోతలు అనేక సార్లు వినేవుంటారు. 1987లో స్రవంతి మూవీస్, వంశీ దర్శకత్వంలో వచ్చిన”మహర్షి” చిత్రంలో మహర్షి రాఘవ, శాంతి ప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన అన్ని గీతాలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. అయితే 1980 దశకంలో ప్రసిద్ధ హీరోయిన్ భానుప్రియ చెల్లెలే శాంతి ప్రియ. రాజమండ్రికి చెందిన ఈ అక్క చెల్లెలు సినిమా రంగంలో ప్రవేశించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

శాంతి ప్రియకు నిశాంతి అనే మరోపేరు ప్రాచుర్యంలో ఉంది. 1987లో “ఊరు ఎంగ పాటుక్రన్” అనే తమిళ చిత్రంలో శాంతిప్రియ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1989, జగపతి ఆర్ట్స్, మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన “సింహ స్వప్నం” చిత్రంలో జగపతిబాబు, శాంతిప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత రక్తకన్నీరు, శిలాశాసనం జస్టిస్ రుద్రమదేవి వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

ఆ తర్వాత బాలీవుడ్ లో సుగంద్ అనే చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా మొదటి సారిగా నటించారు. ఆ తర్వాత మేరే సజన సాత్ నిభాన, ఫూల్ ఔర్ అంగార్ వంటి చిత్రాల్లో శాంతిప్రియ నటించారు. వి.శాంతారామ్ మనవడైన సిద్ధార్థరాయ్ ని1999లో ఆమె వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగ కొనసాగుతున్న వీరి వైవాహిక జీవితంలో ఒక్కసారిగా పెను విషాదం చోటు చేసుకుంది. 2004లో సిద్ధార్థ రాయ్ కి గుండె నొప్పి రావడంతో ఆయన మరణించారు.

అలా శాంతిప్రియ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు శాంతిప్రియ పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉన్నారు. 2011లో మిథున్ చక్రవర్తి కొడుకు మహా అక్షయ్ హీరోగా నటించిన హామిల్టన్ అనే హిందీ చిత్రంలో ఆమె ప్రధానపాత్ర పోషించారు. ఒకప్పటి “సుమం ప్రతి సుమం సుమం” అనే పాటలో కనిపించిన శాంతి ప్రియకు ఇప్పుడున్న శాంతిప్రియకు చాలా తేడా కనిపిస్తుంది. ఏది ఏమైనా శాంతిప్రియ తిరిగి తెలుగు చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.

































