సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటులు ధర్మవరపు సుబ్రమణ్యం. రేడియో నుంచి.. అటుపై టీవి రంగం అక్కడ మంచి పాపులారిటీ దక్కడంతో అక్కడ నుండి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ధర్మవరపు సుబ్రమణ్యం స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం. సాధారణంగా ప్రకాశం జిల్లా వారికి కాస్త వెటకారపు ధోరణి వాళ్ళు మాట్లాడే మాటల్లో కనిపిస్తుంటుంది. అంటే పక్కవారు ఏదైనా అడిగితే పుల్ల విరిచినట్టుగా సమాధానం ఇస్తుంటారు. అందులో నుంచే హాస్యం కూడా పుడుతుంది.

అదే స్వభావం ధర్మవరపు సుబ్రమణ్యంలో ఉండటం వల్ల ఆయనని కళారంగం వైపు తీసుకు వచ్చింది.. ధర్మవరపు సుబ్రమణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. అక్కడ కూడా ఆయన పోషించింది హాస్య ప్రధానమైన పాత్రలే. రేడియోలో కొంతకాలం పని చేశారు. అదే సమయంలో దూరదర్శన్ లో వ్యవసాయదారుల కోసం కొన్ని స్క్రిప్టులు రాసేవారు. అవన్నీ ఆయనకి బాగా పేరు తీసుకు వచ్చాయి. దాంతో ఆనందోబ్రహ్మ అనే నాటిక రాసే అవకాశం వచ్చింది. అయితే దీనికంటే ముందు అనగనగా ఒక శోభ అనే సీరియల్ రాశారు. దానికి ఆరున్నర లక్షలు పెట్టుబడి పెట్టి నిర్మించారు. కానీ అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఆ తర్వాత ఆనందోబ్రహ్మ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చింది. ఇక ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చిన మొదట్లో చిరంజీవిగారి ఇంట్లో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, ఇతర నటీనటులు పాల్గొన్నారు. అందరు రావడానికి కొంత సమయం పడుతుండటంతో చిరంజీవి గారు ఎవరినైనా జోక్స్ చెప్పమన్నారు. ఆ అవకాశం ధర్మవరపు సుబ్రమణ్యం కి వచ్చి ఆయన తన సత్తా చూపించారు. అలా దర్శకుడు జంధ్యాల గారిని ఆకట్టుకున్నారు. జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆయన పాత్రకి మంచి పేరు రావడంతో ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యపాత్రలో తనకంటూ ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. వరుసగా అద్భుతమైన పాత్రలు చేస్తూనే దర్శకునిగా తోకలేని పిట్ట అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ కమెడియన్ ఆలీ హీరోగా నటించారు. ఈ సినిమాకి ధర్మవరపు సుబ్రమణ్యం సంగీతం కూడా అందించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మళ్ళీ దర్శకత్వం, సంగీతం వైపు వెళ్ళలేదు. ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం పోషించిన పాత్ర లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్.

నువ్వు నేను తర్వాత ధైర్యం లాంటి చాలా సినిమాలలో లెక్చరర్ పాత్ర పోషించి కడుపుబ్బా నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరుస్తున్నారనే టాక్ రావడంతో నెమ్మదిగా ఆ పాత్రలను చేయడం మానేశారు. ధర్మవరపు సుబ్రమణ్యం సినీ ప్రయాణంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి, అతడు, యజ్ఞం, జై చిరంజీవ లాంటి ఎన్నో భారీ సినిమాలలో గొప్ప పాత్రలను చేసి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు.



























