డాక్టర్ కాబోయి యాక్టర్ అయినా హీరో రాజశేఖర్. తల్లిదండ్రుల కోరిక మేరకు చెన్నై లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. త్వరలో స్టెతస్కోప్ పట్టుకోబోయి.. హఠాత్తుగా సినిమా కెమెరాముందుకు వచ్చారు. చదువుకునే రోజుల్లో తన స్నేహితులు అందంగా ఉన్నావు సినిమాల్లో చేరమని చెప్పారు. అలా స్నేహితులు ఇచ్చిన సలహా.. మరియు సినిమాల్లో అనుకోకుండా అవకాశం రావడంతో సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

1985లో “వందేమాతరం” సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రతిఘటన, అరుణ కిరణం, శృతిలయలు, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, అహంకారి, ఆగ్రహం, రాజసింహం, శిలాశాసనం, అల్లరి ప్రియుడు, మొరటోడు నా మొగుడు, ఎవడైతే నాకేంటి, భరత సింహారెడ్డి, గరుడవేగ, కల్కి లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.

అంకుశం మగాడు వంటి చిత్రాల్లో.. యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించిన రాజశేఖర్, లవర్ బాయ్ గా అల్లరి ప్రియుడు చిత్రంలో కనిపించారు. జీవితతో అనేక చిత్రాల్లో కలిసి నటించిన రాజశేఖర్ ఆమెను 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెండవ కూతురు శివాత్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో “దొరసాని” చిత్రంలో నటించారు.

1989లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో “మమతల కోవెల” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాజశేఖర్, సుహాసిని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కూతురుగా రాశి బాలనటిగా కనిపించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత రాశి తిరిగి రాజశేఖర్ తో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. 1999, ఆర్.బి.చౌదరి నిర్మాణం,ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో “నేటి గాంధీ” సినిమా విడుదలయ్యింది.

ఇందులో హీరో, హీరోయిన్లుగా రాజశేఖర్, రాశి నటించారు. ఒకప్పుడు రాజశేఖర్ తో “మమతల కోవెల” చిత్రంలో బాలనటిగా కనిపించిన రాశి తిరిగి ఆయనతో నేటి గాంధీ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు హీరోగా వచ్చిన “శుభాకాంక్షలు” చిత్రంలో రాశి మొదటిసారిగా హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత శ్రీకాంత్, బాలకృష్ణ, రాజశేఖర్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి హీరోలతో నటించి అనతికాలంలోనే రాశి ఎంతో పేరు తెచ్చుకున్నారు.


































