సినీ పరిశ్రమలో సినిమా పేరు చెప్పగానే.. దాని దర్శకుడు ఎవరో దాదాపుగా చెప్పేయవచ్చు. పౌరాణిక చిత్రాలంటే కమలాకర కామేశ్వరరావు, జానపద చిత్రాలంటే విటలాచార్య, యాక్షన్ చిత్రాలంటే కే.ఎస్.ఆర్.దాస్, కళాత్మక చిత్రాలంటే కె.విశ్వనాథ్. ఇలా ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వాతిముత్యం, స్వాతి కిరణం ఈ సినిమా పేర్లు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేపేరు కె.విశ్వనాథ్.

ఆయన తీసిన కళాత్మక చిత్రాలు ఖండాంతరాలకు వ్యాపించి అనేకమంది ప్రేక్షకాభిమానులను ఆయన సంపాదించుకోగలిగారు. ఆయనా తీసే చిత్రాలకు అవార్డులు దాసోహం అన్నాయి. తెలుగు సాహిత్యాన్ని, సంగీతాన్ని మేళవించి తీసిన చిత్రాలు అజ్ఞానమనే అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేల్కొలిపాయి.

1976 గీతాకృష్ణ కంబైన్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “సిరిసిరిమువ్వ” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో చంద్రమోహన్, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. నాట్యాన్ని ప్రధానంశంగా చేసుకొని వచ్చిన ఈ సినిమా కళాతపస్వి రూపొందించిన చాలా చిత్రాలకు మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు.

1980, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “శంకరాభరణం” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. శంకరాభరణం శంకరశాస్త్రి గానాన్ని ప్రాణంగా భావించి, తన జీవితాన్ని కొనసాగించే పాత్రలో సోమయాజులు సినిమా మొత్తం తానే నటించారనేకంటే నడిపించారనడం సమంజసం. ఇలా సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం లాంటి అనేక చిత్రాలు కళలను ఆధారంగా చేసుకుని కె. విశ్వనాథ్ మనసుపెట్టి రూపొందించారు.

కానీ ఈ చిత్రాల కంటే ముందు 1978లో శోభన్ బాబు, కైకాల సత్యనారాయణలను ప్రధాన పాత్రలో “కాలాంతకులు” అనే చిత్రాన్ని కె.విశ్వనాధ్ నిర్మించారు. “కాలాంతకులు” చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్ అంటే దాదాపుగా ప్రేక్షకులు ఎవరూ నమ్మరు.

ఒక విధంగా చెప్పాలి అంటే కె.విశ్వనాథ్ తన సినీ కాంపౌండ్ దాటి తీసిన చిత్రంగా “కాలాంతకులు” చిత్రాన్ని పేర్కొనవచ్చు. తాను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది.































