కొన్ని గొప్ప పనులు అత్యంత సైలెంట్ గా జరుగుతాయి. అద్భుతం బయటకు వచ్చే వరకు ఎవరికీ తెలియదు. అలాగే సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు చడీ చప్పుడు లేకుండా వచ్చి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధిస్తాయి. అసలు ఈ సినిమాలు ఆ రేంజిలో విజయం సాధిస్తాయని జనాలు కాదు కదా.. కనీసం ఆ సినిమా దర్శకులు కూడా ఊహించి ఉండరు. సేమ్ అలాంటి కోవకు చెందినతే ‘యువతరం కదిలింది’ సినిమా.

1980లో విడుదలైన ఈ సినిమాకు సత్యం దర్శకత్వం వహించాడు. నవతరం పిక్చర్స్ బ్యానర్ పై మాదాల రంగారావు రాసి సమర్పించాడు. ఈ సినిమాలో రంగారావుతో పాటు రామకృష్ణ, నారాయణ రావు, మురళీ మోహన్, రంగనాథ్, సాయిచంద్, ప్రభాకర్ రెడ్డి, నాగ భూషణం కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సి నారాయణ రెడ్డి రాశాడు. ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో.. అనే పాటను అదృష్ట దీపక్ రాశాడు. ఈ రెండు పాటలు జనాలను విపరీతంగా ఆయకట్టుకున్నాయి.

అటు అదృష్ట దీపక్ రాసిన పాటతోనే ఈ సినిమా పాటల రికార్డింగ్ షురూ అయ్యింది. చలపతిరావు స్వరాలు కూర్చిన ఈ పాటను రామకృష్ణ, విజయలక్ష్మీ శర్మ టీం పాడారు. 1980 మార్చి 26న మద్రాస్ విజయా గార్డెన్స్ లో ఈ కార్యక్రమం మొదలయ్యింది. అయితే ఈ ప్రోగ్రాం అప్పట్లో సంచనలం కలిగించింది. పూజలు, పురస్కారాలు లేకుండానే.. కొబ్బరి కాయులు కొట్టకుండానే ఈ కార్యక్రమం మొదలైంది. సెంటిమెంట్లను పట్టించుకోకుండా ఈ సినిమా మొదలు పెట్టి మాదాల రంగారావు తన పంథాను చాటి చెప్పాడు. కొబ్బరి కాయ కొట్టకుండా సినిమా మొదలు పెట్టడం సినిమా పరిశ్రమలోనే తొలి సారి అంటూ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.

అంతేకాదు.. ఆశయాల పందిరిలో.. పాట రికార్డింగ్ కొనసాగుతుండగానే యువతరం కదిలింది సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు దర్శకుడు రంగారావు. అదే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేశారు. చిన్న బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలను వెనక్కి నెట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.































