సినిమా ఇండస్ట్రీలో పొగడ్తలు, ప్రశంసలు సర్వ సాధారణం. అప్పట్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా దాన్ని గొప్పగా ప్రచారం చేసుకునే వారు. అప్పట్లో హీరోలు, హీరోయిన్స్, దర్శక, నిర్మాతలు ఒక సినిమా భారీ హిట్ సాధించినా దాన్ని భారీ స్థాయిలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకునే వారు కాదు. 100 రోజులు సినిమా ఆడిందంటే అప్పుడు చిత్ర బృందం థియేటర్స్ లో జనాలకి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చేవారు. ఒక సినిమా రిలీజ్ అవగానే మరో సినిమా మొదలు పెట్టేవారు. అందుకే అప్పటి హీరోలు నందమూరి తారక రామారవు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్వీ రంగారావు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, చంద్ర మోహన్, శోభన్ బాబు, మురళీ మోహన్ లాంటి వారు వరుసగా మూడు షిఫ్టుల్లో పని చేసేవారు.

హీరోలు మాత్రమే కాదు సావిత్రి, జమున, అంజలీ దేవీ, భానుమతి, కృష్ణ కుమారి, సూర్యా కాంతం, ఛాయాదేవీ, రామ ప్రభ, అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ, విజయ నిర్మల లాంటి వారు కూడా మూడు షిఫ్టుల్లో పనిచేసే వారు. అందుకే వీరి ఖాతాలలో వందల కొద్ది సినిమాలున్నాయి. ఇక దర్శక, నిర్మాతలు.. గాయనీ, గాయకులు, సంగీత దర్శకులు క్షణం తీరిక లేకుండా వరుస బెట్టి సినిమాలు చేస్తుండేవారు. అప్పటి వారికి పబ్లిసిటీ పిచ్చి ఉండేది కాదు. సినిమా చేస్తే నిర్మాత బాగుండాలి.. అదే నిర్మాతతో మరో సినిమా చేయాలి. ఇదే లక్ష్యంగా పెట్టుకునేవారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, సావిత్రి లాంటి వారు నిర్మాతలకి అనుకూలంగా ఉంటూ వారి సినిమాలు పోయినా మళ్ళి డేట్స్ ఇచ్చి ఆదుకున్నారు.

ఆ తర్వాత తరంలో వచ్చిన అందాల తార శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక, సుహాసిని, సుమలత, ఆ తర్వాత సౌందర్య లాంటి వారు సినిమా అంటే ఓ పాషన్లా ఉండేవారు. పొగడ్తలకి ఆస్కారం చాలా తక్కువ సందర్భాలలో ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫస్ట్ లుక్ అంటూ టైటిల్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అని సినిమా ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. సినిమా జనాలకి నచ్చకపోయినా వాళ్ల నెత్తిన నూనే పోసి రుద్దే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక పొగడ్తలకి అడ్డు అదుపే ఉండటం లేదు. సినిమా రిలీజ్ కి ముందు పబ్లిసిటీ అంటూ నానా హంగామా చేసి, రిలీజయ్యాక మౌత్ టాక్తో పని లేకుండా హిట్ అని చెప్పుకుంటారు. హీరో బాగా చేశాడని డైరెక్టర్..అద్భుతంగా సినిమా తీశాడని హీరోలు పొగిడేసుకుంటున్నారు.

ఇక భాష రాకపోయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ముంబై మోడల్స్ నో, హిందీ సహా పర భాషా నటీమణులనో తీసుకు వచ్చి స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నా అర్థమయినట్టు ఇకిలించే హీరోయిన్స్ను తెగ పొగిడేస్తున్నారు. 10 తెలుగు సినిమాలు చేసినా తెలుగు భాష మాట్లాడటం మాత్రం రావడం లేదు. అయినా పాన్ ఇండియన్ హీరోయిన్ అంటున్నారు. కానీ అలనాటి మేటి నటి వాణిశ్రీ ఎంత గొప్ప నటిమణీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

చిన్న పాత్ర అయిన్నా, ఏడెనిమిది సన్నివేశాలున్నా నటించడానికి ఒప్పుకున్నారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాణిశ్రీని ఇండస్ట్రీలో పొగిడిన వారంటూ ఉంది ఒకే ఒక్క ఎన్.టి.రామారావు గారు మాత్రమే. ఆమె నటించిన కథానయక మొల్ల అనే సినిమా క్లైమాక్స్ సీన్స్ బాగా చేశావని సినిమా ప్రివ్యూ చూసి మెచ్చుకున్నారట. అంతే తప్ప మిగతా ఎవరూ తను బాగా డైలాగ్స్ చెప్తావని, బాగా యాక్ట్ చేస్తావని, అందంగా ఉంటావని ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేదని స్వయంగా వెల్లడించారు.
































