టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల విడుదల విషయంలో కాస్త గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ముందే చిత్రాల విడుదల ప్రకటన ముగిసిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో సర్కారు వారి పాట, రాధేశ్యామ్ , భీమ్లా నాయక్ బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా త్రిబుల్ ఆర్ విడుదల తేదీని జనవరి 7 కి మార్చడంతో అసలు సమస్య వచ్చి పడింది. దీనితో సంక్రాంతి బరిలో నుంచి భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలు తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ వార్తలను నిజం చేస్తూ సర్కారు వారి పాట సినిమాను సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది చిత్రబృందం. దీనితో భీమ్లా నాయక్ సినిమా కూడా అదే బాట పడుతుందనే అందరూ అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ మూవీమేకర్స్ కూడా దాదాపుగా అదే నిర్ణయం తీసుకున్నారట. కానీ పవన్ అభిమానులు మాత్రం ఆ సినిమాను అనుకున్న ప్రకారం జనవరి 12న విడుదల కావాలని డిమాండ్ చేసారు.
సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేయడానికి వీలులేదు అంటూ కామెంట్స్ రూపంలో తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఫాన్స్ డిమాండ్ కి భీమ్లా నాయక్ మూవీమేకర్స్ తలొగ్గినట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలోనే భీమ్లా నాయక్ అంటూ నేడు అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి బరిలో మూడు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని అర్థమవుతోంది.
ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రానా మరొక హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.































