Jamuna : ‘పుట్టిల్లు’ సినిమా ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యింది జమున. ‘మిస్సమ్మ’ సినిమా జమున కెరీర్ లో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. జమున తెలుగుతో పాటు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించారు. అయితే కెరీర్ ఆరంభ రోజులలో జరిగిన కొన్ని విషయాలు జమున గారు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అప్పట్లో యంగ్ హీరోతో జమున ప్రేమలో ఉన్నారని, వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొందరి హితబోధ వలన ఆ నిర్ణయం వెనుకకు తీసుకున్నారట.

ప్రేమ మత్తు వదిలించిన ఎస్వి రంగారావు…
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, సూర్యకాంతం వంటి భారీ నటులతో వచ్చిన ‘గుండమ్మకథ’ సినిమా అందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో తాగుడు అలవాటు బాగా ఉన్న ఎస్విఆర్ గారు జమున గారు నిద్రపోతున్న గది తలుపులు కొట్టారట. ఫుల్లుగా తాగి ఉన్న ఆయన తెల్లవార్లు జమున గారిని కూర్చోబెట్టి జీవితం గురించి హిత బోధ చేశారట. ఒకానొక సమయంలో విసుగు చెందిన జమున గారు మెల్లిగా జారుకోనే ప్రయత్నం కూడా చేశారట.

అయితే ఎస్విఆర్ గారు ‘ఏ పిల్ల… ఒక కుర్ర హీరోతో నీ యవ్వారం నాకు తెలుసు, అతన్ని అందరూ ఎన్టీఆర్ అంత హీరో అవుతాడు అనుకుంటున్నారు. కానీ అతడు తాగుడులో మరో ఎస్విఆర్ అవుతాడు జాగ్రత్త’ అని చెప్పాడట. దాంతో జమునకు జీవితం మీద జ్ఞానోదయం అయ్యి అతనితో పెళ్లి వద్దు అనుకున్నారట. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయం చెప్పకపోయినా అప్పట్లో జసమున ప్రేమించిన ఆ హీరో హరినాథ్ అని వార్తలు వచ్చాయి. ఎస్విఆర్ చెప్పినట్టు నిజంగానే తాగుడుకి బానిస అయ్యి తరువాత మరణించడం కూడా జరిగింది.



























