Jayalalitha: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె విలువైన వేలకోట్ల ఆస్తికి వారసులు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలోనే దీపక్, దీప అనే ఇద్దరు తాము జయలలిత వారసులమని ఆస్తి మాకే దక్కాలి అంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కర్ణాటక కోర్టు పూర్తిగా కొట్టివేసింది.

జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. నాడు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలకు కర్ణాటకకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఈ క్రమంలోనే దీపక్ దీప ఆస్తిమాకే చెందాలి అంటూ వేసిన పిటీషన్ కర్ణాటక కోర్టు కొట్టి వేయడంతో వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.
జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి అంటూ ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్పారు. జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు రు.913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. వాటి విలువ నేడు కనీసం రూ.4,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, రత్నాలు ఉన్నాయి. 601 కిలోల వెండి.. 10,000 చీరలు.. 750 జతల పాదరక్షలు.. 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు.. నివాసాలకు సంబంధించిన దస్తావేజులు తదితరాలు ఉండగా… వాటిని భారీ భద్రత నడుమ తీసుకువెళ్లాలని తెలిపారు.తాజాగా న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు అధికారులకు అప్పగించారు.






























