ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మధుమేహం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా పండ్లు తీసుకునే విషయంలో డయాబెటిస్ రోగులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాంటి పండ్లలో సపోటా ఒకటి. ఇది రుచికరంగా ఉండటంతో పాటు పీచు, విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉన్నా, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం దీనిపై సందేహాలు పెంచుతోంది.

నిపుణుల ప్రకారం సపోటాలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. దీనికి మధ్యస్థం నుంచి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మితిమీరిన వినియోగం ప్రమాదకరమవుతుందని చెబుతున్నారు. అయితే ఇందులో ఉన్న ఫైబర్ కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి చక్కెర శోషణ కొంతవరకు నియంత్రణలో ఉండొచ్చని అంటున్నారు.
అందుకే డయాబెటిస్ ఉన్నవారు సపోటాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకేసారి ఎక్కువగా తినకుండా, చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అలాగే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే గ్లూకోజ్ ప్రభావం తగ్గే అవకాశముంది.
ప్రతి వ్యక్తి శరీర స్పందన వేర్వేరుగా ఉండటంతో, ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. సరైన నియంత్రణ, సమతుల్య ఆహారం పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.






























