ఈ ఏడాది(1986) దాదాపు 118 చిత్రాలు విడుదలయ్యాయి. పూర్ణోదయా వారి ‘స్వాతిముత్యం’ సూపర్ హిట్టయింది. ‘ముద్దుల కృష్ణయ్య’ ఆరంభంలో ఆపసోపాలు పడ్డా, తరువాత సూపర్హిట్గా నిలిచి, 365 రోజులు ప్రదర్శితమైంది. తొలి 70 యమ్.యమ్. చిత్రం ‘సింహాసనం’ కృష్ణను దర్శకునిగా పరిచయం చేసి శతదినోత్సవం జరుపుకుంది. ఇదే సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఖైదీ రుద్రయ్య” చిత్రంలో నటించారు. ఇందులో హీరోయిన్ గా అందాల నటి శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత
సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో మరో సినిమా వెండితెరపై కృష్ణ అభిమానులను సందడి చేసింది.

“జయం మనదే” 1986 లో గ్రామీణ నేపథ్యంగా వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పరుచూరి సోదరులు రచన, కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ ఘట్టమనేని, శ్రీదేవి కపూర్, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1986 ఏప్రిల్ 10 న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.

సూర్యవంశం, రాజా, కలిసుందాం రా లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు వెళ్తున్న విక్టరీ వెంకటేష్ తమ సొంత బ్యానర్ లో మరొక చిత్రంలో నటించారు. “జయం మనదేరా” ఎన్. శంకర్ దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చిత్రం. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. అభిరాం (వెంకటేష్) లండన్లో ఉండే ఒక సరదా మనిషి. భారతదేశం నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి వారిని యూరోపు యాత్రకి పంపిస్తారు. అభిరాం వాళ్ళకి గైడుగా వ్యవహరించడానికి వస్తాడు.

ఆ యాత్రీకుల బృందంలో అతనికి తన బామ్మతో పాటు వచ్చిన ఉమ (సౌందర్య) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది… ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మిగతా కథాంశం.. వందేమాతర శ్రీనివాస్ సంగీతం నుంచి జాలువారిన “మెరిసేటి జాబిలి నువ్వే.. అనే పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. వెంకటేష్ మహాదేవ నాయుడు, అభిరామ్ అనే రెండు పాత్రల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. అలా ఈ చిత్రం 2000 అక్టోబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
































