కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఏప్రిల్ 14 తో ముగియనుంది అయితే ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) జరిపిన ఒక సర్వేలో వెల్లడిందని పేర్కొంది. ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం వల్ల చాలా పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ రంగ సంస్థల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని తేలింది. లాక్ డౌన్ ప్రకటించిన సమయంలోనే కొన్ని చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఉద్యోగులకు ఒక నెల జీతాలు చెల్లించి.. ఉద్యోగాలనుంచి తీసివేసాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సాఫ్ట్ వేర్ కంపినీలు కొంత మంది ఉద్యోగులకు టెర్మినేషన్ లెటర్స్ మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తుంటే కంపెనీలు తమ ఉద్యోగులను వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తోంది సీఐఐ.

గత వారం దాదాపు 200 మంది సీఈఓలతో ఒక సర్వే చేసింది సిఐఐ. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ఆయా సంస్థల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సర్వేలో ఆయా కంపెనీలు లాక్ డౌన్ కారణంగా దాదాపు 10 శాతం కన్నా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. దీనితో లాభాల్లో ఐదు శాతం మేర తగ్గడంతో పలు సంస్థలు ఉద్యోగుల కోతకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని తేల్చింది. ఇదే జరిగితే 15 శాతం కన్నా ఎక్కువ ఉద్యోగాల కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది.

మరో వైపు లాక్ డౌన్ ప్రభావంతో నష్టపోయిన పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించి, దానిని ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో అమలు చేస్తుందన్న ఆశాభావాన్ని సిఈఓ లు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగుల కోత మాత్రం తప్పదు అని తెలిపారు. దీనితో లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి 25 మిలియన్ల ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని కూడా నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.




























