మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు 25 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈరోజునుంచే కొత్త మద్యం ధరలను అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు వైన్ షాప్స్ తెరచి ఉంచుతారు. మరోవైపు మద్యం విక్రయాలపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు తగు మార్గదర్శకాలు జారీ చేసారు. ఈ క్రమంలో పెంచిన మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఆ మద్యం రేట్లు ఎలా ఉన్నాయంటే.. 120 రూపాయిల ధర ఉన్న క్వాట్టర్ బాటిళ్లపై 20 రూపాయిలు పెంచారు. హాఫ్ బాటిల్ పై 40 రూపాయిలు, ఫుల్ బాటిల్ పై 80 రూపాయిలు పెంచారు. అంతేకాకుండా 120 రూపాయిల నుండి 150 రూపాయిల ధర ఉన్న క్వాటర్ బాటిళ్ల పై 40 రూపాయిలు పెంచారు. అదే విధంగా హాఫ్ బాటిళ్లపై 80 రూపాయిలు, ఫుల్ బాటిళ్లపై 120 రూపాయిలు పెంచారు.

అదే విధంగా 150 రూపాయలకు పైన ఉన్న క్వాట్టర్ బాటిళ్లపై 60 రూపాయిలు, హాఫ్ బాటిల్ పై 120 రూపాయిలలు, ఫుల్ బాటిళ్లపై 240 రూపాయిలు పెంచారు. మినీ బీర్ పై 20 రూపాయిలు, ఫుల్ బీరుపై 30 రూపాయిలు పెంచుతూ జగన్ సర్కార్ ధరలను నిర్ణయించింది.































