మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై ఇప్పటికే కేసులు నమోదవగా, తాజాగా ప్రముఖ గాయని మంగ్లీ పేరు కూడా వినిపించడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.

తనను కావాలనే ఈ కేసులోకి లాగుతున్నారని మంగ్లీ ఆరోపించారు. ఈ మోసంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, బాధితులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. నిజం బయటపడే వరకు తాను బాధితుల పక్షాన నిలబడతానని, వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. చట్టం, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో నడిచిన ఈ స్కీమ్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పి మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులను ఆకర్షించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చి నమ్మకం కల్పించి, తర్వాత భారీగా డబ్బులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
కాలక్రమేణా చెల్లింపులు ఆగిపోవడంతో బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కోట్ల రూపాయలు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్టు సమాచారం. పలువురు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేయగా, నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో మంగ్లీ పేరు రావడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తనపై వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుండగా, నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది































