సినిమా పాటలు ఎంత హిట్ అవుతాయో, వాటిని పాడే సింగర్స్కూ అంతే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, లైవ్ కాన్సర్ట్స్లో గాయకులు స్టేజ్పై సందడి చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో లైవ్ సింగింగ్పై అనుమానాలు తలెత్తితే, సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తుతుంటాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చర్చనీయాంశంగా మారింది.

పంజాబీ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ ఓ లైవ్ ఈవెంట్లో చేసిన ప్రదర్శనపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాలో ఆమె పాడిన పాటలు మంచి స్పందన పొందడంతో, వివిధ నగరాల్లో కాన్సర్ట్స్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె స్టేజ్పై చేసిన ప్రదర్శన ఇప్పుడు వైరల్గా మారింది.
ఈ కార్యక్రమంలో జాస్మిన్ స్టేజ్పై ఉత్సాహంగా డాన్స్ చేస్తూ, పాటలు పాడుతున్నట్టు కనిపించారు. అయితే కొంతసేపటికే మైక్ను పక్కన పెట్టినా బ్యాక్గ్రౌండ్లో పాట వినిపించడంతో, ఆమె నిజంగా పాడడం లేదనే సందేహాలు మొదలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవడంతో, లిప్ సింక్పై విమర్శలు పెరిగాయి.
దీంతో నెటిజన్స్ కామెంట్స్ వరదలా వెల్లువెత్తుతున్నాయి. “లైవ్ కాన్సర్ట్ అంటారా.. లేక ట్రాక్పైనే డ్యాన్స్ చేస్తారా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం స్టేజ్ ప్రెజెన్స్ బాగుందని, కానీ నిజంగా పాడితే ఇంకా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కాలంలో లైవ్ ప్రదర్శనల విషయంలో పారదర్శకతపై చర్చలు పెరుగుతున్నాయి. ప్రేక్షకులు అసలు గానం వినాలని ఆశపడుతుంటే, ఇలాంటి ఘటనలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాస్మిన్ సాండ్లాస్ ఘటన కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

































