Mogilayya : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడటంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ దర్శనం మొగిలయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఈయన తన తండ్రి ద్వారా కిన్నెర వాయిద్యం నేర్చుకున్నాడు. 7 మెట్ల కిన్నెరను 12 మెట్ల కిన్నెరగా మార్చి వాయించడం ఈయన ప్రత్యేకత. తన జానపద పాటలతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుతూ తన పాటలతో కొంచెం డబ్బును సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మరే రాష్ట్రాలలో కూడా 12 మెట్ల కిన్నెర వాయించే కళాకారులు లేకపోగా గతంలో మొగిలియ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. అంతేకాకుండా 8వ తరగతి లో ఈయన పై ఒక పాఠ్యాంశాన్ని కూడా ప్రవేశపెట్టారు.

పద్మశ్రీ తిరిగిచ్చేస్తా…..
అంత వరకు అంతగా గుర్తింపు రాకపోయినా భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఇక మొగిలయ్య ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది. అయితే తాజాగా మొగిలయ్య తనకొచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు.

నన్ను ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వమే.. ప్రభుత్వం నన్ను సత్కరించి, హైదరాబాద్ లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చింది, కానీ పద్మశ్రీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ వాళ్లు సీఎం ఇంటి నుండి నీకు కోటి రూపాయలు ఇచ్చారా అంటూ గొడవపడుతున్నారు. ఈ బద్నాం నాకొద్దు.. ఆ అవార్డు ఎవరిదైతే నాకేంటి వెనక్కు ఇచ్చేస్తా కానీ నాలాంటి పేదోడి నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.






























