కరోనా మొదటి వేవ్ కాలంలో కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే అటువంటి పరిస్థితుల్లో సినిమాలో విలన్ గా అందరికీ సుపరిచితుడైన సోనూసూద్ రియల్ హీరో అయ్యాడు. తన సొంత డబ్బులను వెచ్చించి రవాణా సౌకర్యం కల్పించారు. అంతే కాకుండా తన వాహనాలను సైతం కొన్ని ప్రాంతాల వరకు కార్మికులకు రవాణాకు ఉపయోగించుకోమని కూడా తెలిపారు.

అప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరికీ కష్టం వచ్చినా ముందుగా చూసేది సోను వైపే అనడంలో అతిశక్తి లేదు. సెలబ్రెటీలు కూడా సోనూ సూద్ ను సాయం కోరుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ కు అభిమాన గణం తయారు అయ్యారు. సోనూ సూద్ నుంచి సాయం పొందిన వారు.. పొందని వారు సైతం అతడిపై అభిమానాన్ని చాటుకున్నారు. సోనూ సూద్ కు అభిమాని అయిన ఉమాసింగ్ మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు.
తన అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు. అతడు ఒక సైకిలిస్ట్. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వరకు సైకిల్ పై వెళ్లాడు. అక్కడి నుంచి కాలి నడకతో పర్వతాన్ని అధిరోహించి అక్కడ భారత దేశం త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్లో సోనూసూద్ను చూపిస్తూ రియల్ హీరో ఆఫ్ ఇండియా అని ప్రకటించాడు. ఇలా ఆ మధుర క్షణాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. ఈ వీడియో పై సోనూ సూద్ స్పందించాడు. వావ్.. ఇకపై నేను మౌంట్ కిలిమంజారో అన్నమాట..చాలా గర్వంగా ఉంది ఉమ అంటూ ట్విట్ కు రిప్లయ్ ఇచ్చాడు.
అతడు సాధించిన ఈ ఘటతకు తాను గర్వపడుతున్నానని.. కృషి , దృఢ సంకల్పం అతనికి సహాయపడ్డాయంటూ చెప్పుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో అతని సంకల్పం చూస్తుంటే మన భారతీయ యువత ఏదైనా చేయాలనీ మనసులో భావిస్తే.. దానిని సాధించేవరకూ నిద్రపోరని ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారని సోనూ సూద్ చెప్పారు. ప్రస్తుతం సోనూ రీట్వీట్.. అతడి ట్వీట్ కలిపి నెట్టింట్లో వైరల్ గా మారింది.






























