Murali Mohan : జగమే మాయ సినిమాతో 1973 లో తెలుగు సినిమాకు పరిచయమైన మాగంటి మురళీ మోహన్ హీరోగా చాలా సినిమాలు చేసారు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తుండిపోయే పాత్రలు చేసిన మురళీ మోహన్ శోభన్ బాబు గారి సలహా మేరకు ఆయన సంపాదించిన డబ్బులను భూమిపై పెట్టుబడి పెట్టి వ్యాపారంలోనూ సినిమాల్లోనూ బాగా సంపాదించారు. ఇక సినిమాల్లో నటిస్తూనే చిత్ర నిర్మాణంలోనూ అడుగుపెట్టారు. జయభేరి సంస్థల ద్వారా సినిమాలను నిర్మించారు.

ఆస్తులున్నా చిన్న ఇంట్లో…
మొదటి నుండి ఆర్ధిక క్రమశిక్షణతో ఉన్న మురళీ మోహన్ గారికి వృధా ఖర్చులు అసలు నచ్చవట. ఇక ఇతర వ్యసనాలు వ్యాపకాల జోలికి వెళ్ళకూడదని సినిమాల్లోకి వచ్చేనాడే తనకు తాను ప్రమాణం చేసుకున్నారట. ఇక సినిమాల్లోకి వచ్చాక మొదటి లక్ష సంపాదించాక కుటుంబంతో కలిసి బయట హోటల్ కి వెళ్లి సరదాగా గడిపారట. ఇక భూమిపై పెట్టుబడి వల్ల కోట్లు సంపాదించినా, వ్యాపారం వల్ల బాగా సంపాదించినా పిల్లలను సెటిల్ చేసి ఆయన మాత్రం అపార్టుమెంట్ లోని ఫ్లాట్ లోనే ఇప్పటికీ ఉంటున్నారట. ఆయన కావాలనుకుంటే కొన్ని ఎకరాల్లో భూమి తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కానీ అలా చేయకుండా కేవలం ఫ్లాట్ లో ఉంటున్నారట. ఇండస్ట్రీ లో మురళీ మోహన్ గారు, రామారావు గారిని పిసినారులుగా భావిస్తారట అందరూ. ఇక ఇదే విషయం పై మురళీ మోహన్ గారు మాట్లాడుతూ సంపాదించిన డబ్బులు సద్వినియోగం చేయాలనుకోవడం పిసినారితనం అయితే నేను పిసినారినే.

రామారావు గారు పాలు అమ్మి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించడం వల్ల ఖర్చు చేసే ముందు ఆలోచించేవారు. ఇక నా విషయంలో ఎంపీ అయ్యాక ఒకసారి రాజమండ్రి వెళ్లాలంటే విమానంలో వెళ్లుండవచ్చు కానీ ట్రైన్ లో ఎంపీ లకు ఫ్రీ ప్రయాణం అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని, ట్రైన్ కి వెళ్లి నాలుగు వేలైనా మిగిలితే వాటిని నేను చదివిస్తున్న పిల్లలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాను. పిసినారిని అయితే 1000 మంది పిల్లలకు విద్య అందించను కదా అని చెప్పారు. ఇక రామారావు గారు దివి సీమ వరదల సమయంలో వసూలు చేసిన డబ్బును ముఖ్యమంత్రి నిధికి ఇవ్వకుండా రామకృష్ణ మఠానికి ఇచ్చి సద్వినియోగం చేసారు. కానీ నేను, ప్రభాకర్ రెడ్డి గారు మరో బృందంగా చందాలు వసూలు చేసాము, ఆ డబ్బు తీసుకెళ్లి ముఖ్యమంత్రి నిధికి ఇచ్చాము అది ఏమైందో మాకు తెలియదు. అలా డబ్బును వృధా చేయడం కన్నా సద్వినియోగం చేయడము తెలియాలి అంటూ చెప్పారు.
































