Murali Mohan : ద్వాపరయుగం నాటి మహాభారతం గాథను నేటి సాంఘిక కథగా మార్చి ఒక చిత్రాన్ని తీస్తే ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనమే మన ఊరి పాండవులు చిత్రం. బాపు రమణల ఊహాత్మక, సృజనాత్మకతకు ప్రతి రూపమే ఆ చిత్రం. మొదటగా ఈ చిత్రాన్ని కన్నడంలో రూపొందించారు ఆ తర్వాత తెలుగులో నిర్మించి తదుపరి హిందీలో హమ్ పాంచ్ గా పునర్నిర్మించారు. మురళీమోహన్ చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్, విజయభాస్కర్ పంచ పాండవుల లాగా కనిపిస్తే కృష్ణంరాజు మహాభారతంలోని శ్రీ కృష్ణుడిని పొలీ ఉంటాడు. 1978 నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కొంత విప్లవాత్మకంగా ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్ర కథను తీర్చిదిద్దారు.

మన ఊరి పాండవుల చిత్ర నిర్మాత జయకృష్ణ ఒకసారి “ప్రాణం ఖరీదు” చిత్ర నిర్మాత గంగాధర్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ నటీనటుల ఆల్బమ్ చూస్తుండగా.. చిరంజీవి ఫోటో చూశారు. ఆయన ముఖంలో తేజస్సు, ఎర్రటి కళ్ళు జయకృష్ణని బాగా ఆకర్షించాయి. ఆ ఫోటో తీసుకువెళ్లి దర్శకుడు బాపుకు చూపించారు. మన చిత్రంలోని అర్జునుడిని పోలిన పాత్రకు బాగా సరిపోతారని చిరంజీవిని తీసుకుందామనుకున్నారు. అలా మన ఊరి పాండవులు చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఉండరని పంచపాండవు లాంటి ఐదుగురు సినిమా మొత్తాన్ని నడిపిస్తారని.. అందులో మీది(చిరంజీవిది) ఒక పాత్ర అని చెప్పడంతో చిరంజీవి ఏమాత్రం ఆలోచించకుండా.. ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు.

మన ఊరి పాండవులు చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం గ్రామీణ వాతావరణంలో జరిగింది. మన ఊరి పాండవులు మెగాస్టార్ చిరంజీవికి నటన పరంగా ఇది మూడో సినిమా, విడుదలపరంగా రెండవ సినిమా.. ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతున్న సమయంలో ఒకసారి మురళీమోహన్, కృష్ణంరాజు కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో.. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందని, తనని చిరంజీవి ఎప్పుడూ అన్నయ్య అని పిలుస్తుంటాడని.. భవిష్యత్తులో చిరంజీవి విలన్ అవుతాడు అనుకున్నాం.. కానీ చిరంజీవి ఏకంగా సినిమాలకే రంకు మొగుడు అయ్యారంటూ.. మురళీమోహన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చమత్కరించడం జరిగింది. బుల్లితెరను చూస్తున్న ప్రేక్షకులకు ఆ మాటలు ఒకింత ఆచ్చర్యానికి గురిచేసాయి.































