Nagarjuna -Amala: శ్రీవారి సన్నిధిలో నాగార్జున దంపతులు… కొడుకుల సినిమాల హిట్ కోసమే వచ్చామంటూ కామెంట్స్!

Nagarjuna -Amala: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమల, నాగార్జున ఇద్దరు కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన నాగార్జున, అమల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ… ఏడాది తర్వాత సతీసమేతంగా ఇలా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా నాగార్జున తన కొడుకులు అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య గురించి కూడా మాట్లాడుతూ..త్వరలోనే మా అబ్బాయిలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాము అని నాగార్జున తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అలాగే మరొకవైపు అక్కినేని నాగచైతన్య కూడా ‘ కస్టడీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

Nagarjuna -Amala: కష్టం ఒకటే కాదు శ్రీవారి ఆశీస్సులు కావాలి…

గతంలో విడుదలైన థాంక్యూ సినిమా నాగచైతన్యకు నిరాశ మిగిల్చింది. దీంతో ప్రస్తుతం కస్టడీ సినిమా మీద నాగచైతన్య ఆశలు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కూడా తాను నటించిన ఏజెంట్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ‘ ది ఘోస్ట్ ‘ సినిమా ద్వారా నాగార్జునకి కూడా పరాజయం ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని సమాచారం.