Narra Venkateswara Rao : నర్రా వెంకటేశ్వరరావు… ఈయన గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించడమే కాకుండా వారి వారసులతో కూడా కలసి నటించారు. తన సినీ ప్రస్థానంలో దాదాపు 500 సినిమాలలో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1974 లో వచ్చిన ‘చదువు సంస్కారం’ అనే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈయన ఆఖరుగా చేసిన సినిమా ‘మేస్త్రి’. ముప్పై సంవత్సరాల సినీ అనుభవంలో సినిమాలో విలన్ పాత్రలు మాత్రమే కాకుండా సహాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు.

సినిమాలలో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని అలా…
నర్రా వెంకటేశ్వరరావు గారికి ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి సినిమాలో మంచి పాత్రలు లభించేవి. ఆయన ఏదయినా సినిమాలో నటించారు అంటే ఆ పాత్ర మాత్రమే కనిపించేది అంతలా నటనలో జీవించేవారు. నర్రా వెంకటేశ్వరరావు గారి భార్య సుశీల, వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు మురళి, కూతురు వసంత లక్ష్మి. ఆయనకు 62 ఏళ్ళ వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అయితే చనిపోయే ముందు ఆయన చేసిన పని మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ఆయన సినిమాలలో కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని చనిపోయే ముందు ఒంగోలుకు చెందిన ప్రజానాట్య మండలికి రాసిచ్చారట. చిన్నతనం నుండి నాటకాలు వేసిన అనుభవం, వాటి మీద ఇష్టంతో ఆ నాట్యమండలి కి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదని ఆయన ఆస్తి మొత్తాన్ని ఆ నాట్యమండలికి దానం చేశారు. సంపాదించిన మొత్తాన్ని అలా చేశారని తెలుసుకున్న వారందరూ ఆయనకు, ఆయన చేసిన పనికి ఫిదా అవుతున్నారు.



























