సాధారణంగా ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో ఉన్న వారికి తమ చుట్టూ ఏం జరుగుతుందో వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో కూడా అర్థం కాదు. ప్రేమలో ఉన్న వారు స్వర్గంలో ఉన్నట్టు ఈ లోకాన్ని మరచిపోయి ఊహలలో తేలుతుంటారు. అదే ప్రేమ బంధం కాస్త పెళ్లి గా మారితే అసలు సమస్యలు బయటపడతాయి. ఈ క్రమంలోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు అప్పుడే బాగుండు అనే భావనలోకి వెళ్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కుంభాల రమ్యకృష్ణ, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన లింగు మణిరత్నం అనే అబ్బాయి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ ప్రేమికులు జాన్కంపేట్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదే విధంగా బుద్ధిష్ట్ అంబేద్కర్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు.
అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకునే క్రమంలోనే ఆ యువతికి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే తన భర్తపై న్యాయం కోసం పోరాడాల్సి వచ్చింది.ఎంతో అన్యోన్యంగా ఉండే వారి జీవితంలోకి తన అత్తమామలు తన భర్తపై తనని వదిలేయాలని ఒత్తిడి తెస్తున్నారని,నాకు విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా తన భర్తే తనకు తెలిపినట్లు బాధితురాలు వాపోయింది.
తల్లిదండ్రుల మాటలు విని తన భర్త తనకు దూరం అవుతున్నారని ఈ విషయమై తనకు న్యాయం జరగాలని నిజామాబాద్ జిల్లాలోని 3టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ తనకు న్యాయం చేయాలని వేడుకోగా వారు స్పందించకపోవడంతో సదరు మహిళ మహిళా సంఘాల సభ్యులతో కలిసి అత్తవారింట ఎదుట తనకు న్యాయం జరగాలని ఆందోళనకు దిగింది.తనకు అండగా నిలిచిన మహిళా సభ్యుల పట్ల తన అత్తింటి వారు దుర్భాషలాడుతున్నారని ఆమె వాపోయింది.అన్యాయం జరిగిన మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం స్పందించకపోవడంతో ఈ విషయంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.






























