వంటగ్యాస్ ధర నెలనెలా పెరుగుతూ.. దాదాపు రూ.వెయ్యికి దగ్గరగా వచ్చింది. పెట్రో ధరలతో పాటు క్రమంగా గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే దీనిపై కేంద్రం ఓ సర్వే నిర్వహించిందట. అందులో వినియోగదారులు పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలిందట.

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరిగే అవకాశమున్నదని తెలుస్తోంది. అయితే దీని కోసమే కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదేంటంటే.. మొదటి ప్రతిపాదనలో గ్యాస్ సిలిండర్ లను ఎలాంటి సబ్సిడీ లేకుండా సరఫరా చేయడం. దీని వల్ల ప్రతీ ఒక్క వినియోగదారుడికి గ్యాస్ దక్కుతుందని ఆలోచన.
మరొక ప్రతిపాదన ఏంటంటే.. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం. అంటే బీపీఎల్ కుటుంబాలకు లేదా.. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇవ్వడం. అయితే వీటిలో కూడా కొన్ని నిబంధనలు. అందులో వార్షిక ఆదాయం రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి రాయితీ రాదు.
దీని వల్ల అవసరమైన వాళ్లకే సిలిండర్ దక్కుతుందనేది ప్రభుత్వ భావన. అయితే కరోనా కాలం నుంచి గ్యాస్ సబ్సిడీని దాదాపు చాలావరకు తగ్గించేసింది. మొదట్లో రూ.200 నుంచి రూ.300 వరకు వచ్చే సబ్సిడీ ప్రస్తుతం రూ.40 కూడా రావడం లేదు. ఇందులో భాగంగానే అసలే ఈ సబ్సిడీని తీసేసి కొత్త పథకం ప్రకారం పైన చెప్పిన విధంగా అమలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

































