ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి గురించి గత సంవత్సరం నుంచి పరిశోధకులు అనేక పరిశోధనలను జరుపుతున్నారు. ఈ విధంగా ఒక్కో పరిశోధనలో భాగంగా వైరస్ గురించి కొత్తకొత్త లక్షణాలు బయటపడుతున్నాయి.ప్రస్తుతం మన దేశంలో వ్యాప్తి చెందుతున్న రెండవదశ వైరస్ రూపాంతరం చెందడం వల్లే ఈ విధంగా రోజురోజుకు కేసులో పెరుగుతున్నాయని ఇప్పటికే నిపుణులు తెలియజేశారు.
తాజాగా ఈ వైరస్ ఎయిర్ బోర్న్గా రూపాంతరం చెందిందని, ఈ విధంగా రూపాంతరం చెందిన వైరస్ కి శక్తి పెరుగుతుందని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చేపట్టిన పరిశోధకులు తెలిపారు. కోవిడ్19 పై నిట్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా రెండు కోట్ల నిధులతో మూడేళ్ల కాలపరిమితిలో ఈ వైరస్ గురించి పరిశోధనలను జరుపుతున్నారు.
గత ఏడాది మే నెలలో ఈ పరిశోధనలకు శ్రీకారం చుట్టగా తాజాగా ఈ పరిశోధనలో భాగంగా ఎయిర్ బోర్న్ గా రూపాంతరం చెందిన ఈ వైరస్ కి మరింత రెట్లు శక్తి పెరగనుందని ఈ పరిశోధనలో పాల్గొన్న బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెరుగు శ్యామ్, గిరీష్ తెలిపారు. ఈ విధంగా వైరస్ రూపాంతరం చెందటం ద్వారా సాధారణ వ్యక్తి తుమ్మినా, దగ్గినా, ఆ తుంపరలు గాలిలో కలిసి ఆరు మీటర్ల వరకు ప్రయాణించే శక్తి పెరిగిందని తెలిపారు.
Advertisement
ఎయిర్ బోర్న్ ద్వారా వైరస్ శక్తి పెరగడంతో ఈ మహమ్మారి సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వీక్ దిశగా ప్రయాణిస్తోందని ప్రొఫెసర్ శ్యామ్, గిరీష్ తెలిపారు.రాబోయే రెండు సంవత్సరాలలో ఈ వైరస్ పై మరిన్ని ప్రయోగాలు నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా వీరు తెలిపారు.