విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దాదాపుగా ఆయన వేయని పాత్ర అంటూ ఇక లేదేమో అనిపిస్తుంది. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో తన నటనా కౌశలంతో అద్భుతమైన పాత్రలు ధరించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో స్వతంత్ర సమరయోధుడిగా, జస్టిస్ చౌదరిలో న్యాయమూర్తిగా, కొండవీటి సింహంలో బాధ్యతాయుతమైన పోలీసాఫీసర్ గా, బొబ్బులిపులిలో దేశ సేవలో పునీతుడైయిన మేజర్ చక్రధర్ పాత్రలలో.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఈ నాలుగు పాత్రలు కీలక భూమికను పోషిస్తాయి.

అలాంటి అద్భుతమైన పాత్రలను పోషించి సమాజంలో ఉన్న అవినీతి, అన్యాయం లాంటి అప్రజాస్వామ్య విధానాలను కూకటివేళ్ళతో పెకిలించారు. బెబ్బులిపులి చిత్రం నిర్మిస్తున్న వడ్డే రమేష్ కథ, సంభాషణలు దాసరి రాసుకుంటున్న క్రమంలో.. మిగతా సాంఘిక చిత్రాల కంటే భిన్నంగా బొబ్బులిపులి సినిమా క్లైమాక్స్ ఉండాలి. అది చరిత్రలో మర్చిపోని సన్నివేశం కావాలని దాసరితో వడ్డే రమేష్ చెప్పారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న దాసరి ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏవిఎమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ సెట్ కు వస్తారు. దాసరి నారాయణరావు ఎనిమిది గంటలకే లొకేషన్ లో ఉన్నారు. ఎందుకనో కోర్టు సీన్ ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో రాసిన పేపర్స్ పక్కకు పెట్టి కొత్త సంభాషణలు దాసరి రాయడం ప్రారంభించారు.

సరిగ్గా తొమ్మిది గంటలకు అన్నగారు లోకేషన్ కు వచ్చారు. సిన్సియర్ గా డైలాగ్స్ రాస్తున్న దాసరిని ఇబ్బంది పెట్టకుండా సెట్లో ఓ మూలాన కూర్చున్నారు. దాదాపు 35 పేజీలతో కోర్టు సన్నివేశాలు, సంభాషణలు ఉ.11 గంటల వరకు రాశారు. లేచి చూసే సరికి అక్కడ ఎన్టీఆర్ కనిపించారు. మేము గమనించాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే అలా పక్కనే కూర్చున్నామని చెప్పడంతో.. దాసరి రాసిన ఎమోషనల్ డైలాగ్స్ ఒకసారి ఎన్టీఆర్ కి వినిపించారు. ఆయన ఏమీ మాట్లాడకుండా.. షూటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందామని ఎన్టీఆర్ అనడంతో దాసరి, ఎన్టీఆర్ కు ఏదైనా పని ఉండవచ్చని భావించారు. కానీ ఆ డైలాగ్స్ పేపర్స్ తీసుకుని ఎన్టీఆర్ చెన్నైలోని మెరీనాబీచ్ కి వెళ్లారు. ఎవరూ లేని చోటుకి వెళ్లి ఆ సంభాషణలు ప్రాక్టీస్ చేశారు. తిరిగి మధ్యాహ్నం లొకేషన్ (ఏవిఎమ్ స్టూడియో)కు చేరుకున్నారు.

కోర్టులో శ్రీదేవి న్యాయవాదిగా కేసుకు సంబంధించిన వివిధ ప్రశ్నలతో ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తుంది. ఈ వాదనల అనంతరం.. నేను పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా యువరానర్ అని మేజర్ చక్రధర్(ఎన్టీఆర్) ప్రశ్నించగా.. అవును అని న్యాయమూర్తి సమాధానమిస్తారు. పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్ అని అడుగగా.. శిక్ష తగ్గించవచ్చు లేదా ఇదే శిక్ష ఖరారు చేయవచ్చు అని న్యాయమూర్తి బదులిస్తారు… ఈ కోర్టు వేసిన శిక్షను ఆ పై కోర్టులో పోవచ్చు లేదా ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా అదే శిక్ష ఖరారు కావచ్చు.. అంటే ఒక కోర్టుకి మరొక కోర్టు కి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.. ఇలా కోర్టు కోర్టు కు తీర్పు తీర్పు కి ఇంత మార్పు ఉంటే.. మీ కోర్టులో న్యాయం ఉన్నట్టా యువరానర్.. ఒక్కొక్క కోర్టుకి ఒక్కో తీర్పు ఉండడం చేతనే నేరస్తుడు తను చేసిన నేరం మర్చిపోయాకగాని శిక్ష పడుతుంది..

తెలివిగల పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామరాజును చంపావా? భీమరాజును చంపావా? అంటూ అడిగారేగాని వారిని ఎందుకు చంపావు? అని ఎందుకు అడగలేదు యువరానర్.. అంటూ మేజర్ చక్రధర్ పాత్రలో ఎన్టీఆర్ తన వాక్పటిమతో, కోర్టు హాలు దద్దరిల్లేలా ప్రత్యేక డైలాగ్ డిక్షన్ తో వీరవిజృంభణ చేశారు. 15 నిమిషాల నిడివి గల ఆ కోర్ట్ సన్నివేశం చూస్తున్న సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నగారి నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ ఒక్క సన్నివేశం తోనే బొబ్బులిపులి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత వచ్చిన అనేక తెలుగు చిత్రాలకు ఈ కోర్టు సీన్ ఒక ప్రేరణగా నిలిచింది.































